కొనాయిమాకుల లిఫ్ట్ పనుల్లో వేగం
రూ.78 కోట్లతో ప్రాజెక్టు
కాకతీయ మెయిన్ కెనాల్ వద్ద పంపుహౌస్
14,085 ఎకరాలకు నీరందించే లక్ష్యం
పంపుహౌస్ నుంచి పైపులైన్ నిర్మాణం
ఉపకాల్వల కోసం భూసేకరణపై అధికారుల దృష్టి
వరంగల్రూరల్, జూన్3 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశా లతో కొనాయిమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కదిలిక వచ్చింది. పంపుహౌస్, పైపులైన్ నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. ప్రధా న, ఉప కాల్వల నిర్మాణం కోసం అధికారులు భూసేకరణపై దృష్టి సారించారు. ఇప్పటికే దుగ్గొండి మండలంలో సర్వే పూర్తి చేసిన అధికారులు గీసుగొండ మండలంలోనూ 60శాతం వరకు సర్వే చేశారు. గీసుగొండ మండలంలోని కొనాయిమాకుల గ్రామం వద్ద రూ.78 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో డీబీఎం- 38, 40 కాల్వల కింద నీరందకుండా ఉన్న గీసుగొండ, దుగ్గొండి, సంగెం, చెన్నా రావుపేట మండలాల్లోని 14,085 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగు నీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. కాకతీయ మెయిన్ కెనాల్ నుం చి ప్రతి సంవత్సరం ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోతతో నిర్దేశిత ఆయకట్టుకు తరలించేవిధంగా జలవనరుల శాఖ ఇంజినీర్లు దీన్ని డిజైన్ చేశారు. ఈ మేరకు కాకతీయ మెయిన్ కెనాల్ను ఆనుకుని నీటినిల్వ కోసం 15 మీట ర్ల వెడల్పు, 20మీటర్ల లోతుతో పంపుహౌస్ నిర్మించారు. ఎత్తిపోత కోసం ఇందులో మూడు మోటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ముఖ్యమంత్రి సమీక్ష
కొనాయిమాకుల ఎత్తిపోతల ప్రాజెక్టులో 12కిమీ పొడవునా మెయిన్ కెనాల్, 14ఉప కాల్వలు నిర్మించాల్సి ఉంది. కొనాయిమాకుల నుంచి గీసుగొండ మండలంలోని విశ్వనాథపురం వరకు అంటే 7కిమీ పొడవున లైనింగ్ సహా మెయిన్ కెనాల్ నిర్మాణం పూర్తయింది. మిగతా 5కిమీ పొడవున ఈ కెనాల్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. 14ఉప కాల్వలది ఇదే పరిస్థితి. భూసేకరణే ఇందుకు కారణం. గీసుగొండ, దుగ్గొండి మండలాల్లో మెయిన్, ఉప కాల్వల నిర్మాణం కోసం భూమిని సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరకాల, నర్సంపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి కొద్దినెలల క్రితం కొనాయిమాకుల ప్రాజెక్టు పనులకు భూసేకరణ అడ్డంకిగా మారిన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం హైదరాబాద్లో గత డిసెంబరు 28న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, ఇప్పటివరకు జరిగిన పనులపై సమీక్ష జరిపారు. సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు భూసేకరణ కోసం రెవెన్యూ, జలవనరుల శాఖ ఇంజినీర్లు రంగంలోకి దిగారు. కలెక్టర్ హరిత, వరంగల్ రూరల్, నర్సంపేట ఆర్డీవోలు కూడా భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
భూసేకరణకు సర్వే
మెయిన్, ఉప కాల్వల నిర్మాణం కోసం దుగ్గొండి మండలంలో 56, గీసుగొండ మండలంలో 187 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూముల విలువ పెరగడం వల్ల రైతులు తమ భూములను ఇచ్చేందుకు విముఖత కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది, చల్లా చొరవ తీసుకుంటున్నారు. భూములు కోల్పోయే రైతులతో మాట్లాడి వారికి నచ్చజెపుతున్నారు. రెవెన్యూ, జలవనరుల శాఖ ఇంజినీర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా దుగ్గొండి మండలంలో ప్రతిపాదిత 56 ఎకరాల భూసేకరణకు అధికారులు సర్వే పూర్తి చేసి నర్సంపేట ఆర్డీవోకు నివేదిక అందజేశారు. గీసుగొండ మండలంలోనూ దాదాపు వంద ఎకరాల వరకు సర్వే చేశారు. ఇంకో 80ఎకరాలకుపైగా సర్వే చేయాల్సి ఉంది. గంగదేవిపల్లితోపాటు ఇతర గ్రామాల రైతులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి సహకారం తీసుకుని త్వరలోనే ఇక్కడా సర్వే పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. భూమిని సేకరించి ఇస్తే మెయిన్, ఉప కాల్వల నిర్మాణ పనులను ఒకటిరెండు నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పంపుహౌస్ నుంచి పైపులైన్
కొనాయిమాకుల వద్ద పంపుహౌస్ నుంచి మెయిన్ కెనాల్ వరకు 310 మీటర్ల పొడవున పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 1.50 మీటర్ల డయాతో కూడిన పైపులను రెండు వరుసలు వేస్తున్నారు. కొద్దిరోజుల్లో ఈ పైపులైన్ పనులు పూర్తికానున్నాయి. కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే నీటిని పంపింగ్తో ఈ పైపులైన్ ద్వారా ప్రాజెక్టు మెయిన్ కెనాల్కు పంపిస్తారు. ఇందుకోసం మెయిన్కెనాల్ వద్ద డెలివరీ సిస్టం నిర్మిస్తున్నారు. సీఎం సమీక్ష తర్వాత పంపుహౌస్, పైపులైన్ నిర్మా ణ పనుల్లో వేగం పెరుగగా, మెయిన్, ఉపకాల్వల నిర్మాణానికి అవ సరమైన భూసేకరణపై అధికారులు దృష్టి సారించారు. కొద్దిరోజుల్లోనే భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.