నల్లగొండ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలని వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అమలవుతున్న లాక్డౌన్ను ఆయన ఎస్పీ ఏవీ రంగనాథ్తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా గడియారం సెంటర్, ప్రకాశంబజార్, డీఈవో కార్యాలయం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలను పర్యవేక్షించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐజీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ప్రజలు లాక్డౌన్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులకు సహకరించి కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావాలని ఇంటి వద్దే ఉంటూ అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దన్నారు. పోలీసులు రోడ్లపై ఉండి విధులు నిర్వహించేది ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఎంతోమంది కరోనా బారిన పడి మృతిచెందడంతో పాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనాను నిర్మూలించేందుకు కృషి చేయాలని సూచించారు.
లాక్డౌన్ మినహాయింపు సమయంలో కూడా గుంపులుగా గుమికూడకుండా భౌతికదూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐలు సురేష్ కుమార్, చంద్రశేఖర్రెడ్డి, దుబ్బ అనిల్, పసుపులేటి నాగ దుర్గాప్రసాద్, నల్లగొండ టూటౌన్ ఎస్ఐ దోరెపల్లి నరసింహులు, రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.