సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : గత రెండు వారాలుగా నగరంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాజాగా విడుదల చేసిన CAAQMS (కంటిన్యూస్ ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్) సూచిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైతోంది. పీసీబీ అధికారులు 2021 మే 1తో పోల్చితే 2021 మే 15 వరకు నమోదైన వాయుకాలుష్య వివరాలను ఇందులో వెల్లడించారు. అయితే మే మొదటి వారంతో పోల్చితే రెండో వారంలో కాలుష్యం మరో 20శాతం తగ్గడం విశేషం. లాక్డౌన్ పటిష్ట అమలుతో వాహనదారులు బయటకు రాకపోవడంతోనే నగరంలో వాయుకాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గిందని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో నగరంలోని అనేక పరిశ్రమలు తక్కువ సిబ్బందితో షిఫ్టుల వారీగా విధులను అమలు చేస్తుంటే.. దాదాపుగా ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోంను ప్రకటించాయి.. అలాగే కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తక్కువ సిబ్బందితో షిఫ్ట్లవారీగా విధులు నిర్వహిస్తున్నాయి.. కరోనా భయంతో చాలామంది బయటకు కూడా రావడంలేదు..దీనికితోడు లాక్డౌన్ పటిష్ట అమలుతో వాహనాల రద్దీ రహదారులపై గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూలేని విధంగా వాయు కాలుష్యం మే మొదటి, రెండవ వారంలో బాగా తగ్గిందని పీసీబీ పర్యావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.
పీసీబీ ప్రకటించిన సీఏఏక్యూఎంఎస్ లెక్కల ప్రకారం గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గింది. పాశమైలారం, బొల్లారం ప్రాంతంలో కూడా కాలుష్య తీవ్రత సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదు కావడం విశేషం.