గురువులకే గురువు, ఆదిగురువుగా భక్తులు ఆరాధించే శ్రీదత్తాత్రేయుని షోడశావతారాల్లో 10వ అవతారమైన ‘శ్రీమాయా యుక్తావధూత’ వైశాఖశుద్ధ చతుర్దశి (ఈనెల 25వ తేది) రోజున స్వాతి నక్షత్రంలో మధ్యాహ్నం జన్మించారు. ఆ రోజు దత్తభక్తులు దత్త దేవాలయంలో
దత్తాత్రేయునికి పంచామృతాభిషేకం చేయాలి. ఆలయం అందుబాటులో లేనివారు శ్రీ దత్తాత్రేయుని చిత్రపటానికి వీలైన రీతిలో పూజించవచ్చు.
శ్రీదత్తాత్రేయుడు భక్తులను పరీక్షించదలచి వివిధరూపాల్లో భక్తులవద్దకు వస్తుంటాడు. ఇందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి. ఆనాడు 10వ అవతారంగా భిక్షాపాత్ర ధరించిన భిక్షకుని రూపంలో అవతరించారు. కనుక, ఆ రోజు పూజ పూర్తయ్యాక దద్దోజనం (పెరుగన్నం) నైవేద్యం పెట్టి, దగ్గరలో కనిపించిన భిక్షకులకు పంచాలి.
మాయా యుక్తాయ శుద్ధాయ, మాయా గుణ హరాయతే
శుద్ధాయ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే॥
అనే శ్లోకంతో శ్రీదత్తాత్రేయుడిని స్మరించి, అర్చించాలి. లభిస్తే ‘దత్తచరిత్ర, మహామహిమాన్వితమైన ‘శ్రీదత్తాత్రేయ వజ్రకవచం’ పారాయణం చేయాలి. ఏ దేవాలయంలోనైనా మేడిచెట్టువద్ద పారాయణం చేస్తే ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేరుతాయి. ఇంట్లోనైనా చేయొచ్చు. ఇది ‘సిద్ధ పారాయణ స్తోత్రం’. దలాదుడనే మునికి శ్రీ దత్తాత్రేయుడే స్వయంగా ఉపదేశించినట్లు తెలుస్తున్నది. (గీతాప్రెస్వారు తక్కువ ధరలో ఈ పుస్తకాన్ని ముద్రించి భక్తులకు అందుబాటులో ఉంచారు. ఏ పెద్ద పుస్తకాల షాపులోనైనా లభిస్తుంది).
ఈ ‘సిద్ధ స్తోత్రాన్ని’ పారాయణం చేసి ఎన్నో వందలమంది ప్రయోజనం పొందారు. భక్తి విశ్వాసాలు ప్రధానం. దత్త స్వరూపులైన మైసూరు దత్త పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి శ్రీ దత్తాత్రేయుని 16 అవతారాలతో 16 స్థలాల్లో విగ్రహప్రతిష్ఠలు చేయించారు. ఆయా స్థలాల్లో శ్రీ దత్తాత్రేయుని అవతార విగ్రహానికి వైభవంగా పూజలు జరుగుతాయి. విశ్వాసంతో అర్చిస్తే, పారాయణం చేస్తే ఫలితం తప్పక ఉంటుంది.
మా బంధువుల అమ్మాయి కాత్యాయని భర్తకు కరోనా సోకి హైదరాబాద్లో ఆసుపత్రిలో చేరాడు. ఆ అమ్మాయి భక్తి విశ్వాసాలతో గురుచరిత్ర (శ్రీదత్తాత్రేయుని మహిమలుగల గ్రంథం) పారాయణం చేసింది. వారిది సామాన్య కుటుంబం. వైద్య సహాయానికి (లక్షల్లో బిల్లు) ఎవరెవరో సహాయం చేశారు. శ్రీదత్తుని కృపతో ఆమె భర్త పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకొన్నాడు.
ఈశ్వరగారి
నరహరిశర్మ
93966 48880