వరంగల్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ నగరాన్ని హెల్త్హబ్గా మా ర్చాలనేది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లక్ష్యమని.. అందుకే కొత్తగా మల్టీ సూపర్ స్పెషాలిటీ, మాతాశిశు సంరక్షణ దవాఖానలను నిర్మించాలని నిర్ణయించారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ సెంట్రల్జైలు వెనుక భాగాన ఉన్న 23 ఎకరాల ఖాళీ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న ఎంజీఎంను మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిలోనే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని సీఎం ఆదేశించినట్టు చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్లతో కలిసి మంత్రి శనివారం వరంగల్లో మీడియాతో మాట్లాడారు. దేశంలోనే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సీఎం కేసీఆర్ కరోనా బాధితుల దగ్గరికి వెళ్లి భరోసా కల్పించారన్నారు. వరంగల్ ఎంజీఎంలో కరోనా బాధితులకు అందుతు న్న వైద్య సేవలు, ఆహారంతోపాటు దవాఖానలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి సీఎం స్వయంగా తెలుసుకున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పర్యటనతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజారోగ్యం మరింత బలోపేతమైందన్నారు. ప్రతి ఒక్కరికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. వ్యాక్సిన్ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రధాని, కేంద్ర మంత్రులు స్పందించడం లేద ని విమర్శించారు. పండించిన ప్రతి గింజను కొనుగోలుచేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా కల్పించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నామని, ప్రజలంతా ఇంట్లోనే ఉండి కరోనా కట్టడికి సహకరించాలని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.