లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ ఎంతోమంది ఇంట్లోనుంచే పని చేస్తున్నారు. ఇంటిపని, పిల్లల పెంపకం, ఆఫీసు పనితో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో మానసిక ఉల్లాసం కోసం ఇంట్లో మొక్కలు పెంచడం ప్రారంభించారు. మంచి ప్రయత్నమే. ఈ ఇండోర్ ప్లాంట్స్ ఇంటికి అందాన్నే కాకుండా మనసుకు ప్రశాంతతనూ ఇస్తాయి. అయితే, మొక్కల పెంపకం అంత సులువు కాదు. అన్ని రకాల మొక్కలు ఒకే వాతావరణంలో ఇమడ లేవు. కావాల్సినంత తేమ, గాలి ఉండాలి. కొన్ని రకాల ఎయిర్ ప్లాంట్స్ను మట్టి లేకుండా పెంచుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ను వారానికోసారైనా కచ్చితంగా సూర్యరశ్మిలో పెట్టాలి. ఎరువు విషయంలోకూడా రసాయనాలు వాడకుండా, వడపోసాక మిగిలిపోయిన కాఫీపొడి, కూరగాయల వ్యర్థాలు, పండ్లతొక్కలతో చేసిన ఎరువును వేయాలి. ఇవి మొక్కలకు శక్తిని ఇస్తాయి. క్రిముల నివారణకు ఉపయోగపడతాయి. మార్కెట్లో ప్లాంట్ ఫుడ్కూడా అందుబాటులో ఉంది. దాన్ని పక్షం రోజులకోసారి వేయాలి. స్పైడర్ ప్లాంట్, కాక్టస్ మొక్కలు ఇంటికి అందాన్నిస్తాయి. అలాగే, బర్జండీ రబ్బర్ ట్రీ, వీపింగ్ ఫిగ్, బ్యాంబూ పామ్ మొదలైనవి ఇంట్లో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. బెడ్రూమ్లో పీస్ లిల్లీ ప్లాంట్ పెట్టుకుంటే ఆక్సిజన్ శాతం పెరుగుతుందని చెబుతారు నిపుణులు.