సిరికొండ, మే 15 : రాష్ట్రవ్యాప్తంగా తండాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనులకు కూడా శ్రీకారం చుట్టింది. తండాలు పురుడుపోసుకున్నప్పటి నుంచి టూఫేజ్ విద్యుత్ మాత్రమే అందుతున్నది. గతంతో పోలిస్తే తండాల్లో యువత విద్యతోపాటు టెక్నాలజీ రంగంలో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవడంతో స్థానిక యువత ఉపాధి అవకాశాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు మినీ ఇండస్ట్రిస్ పిండిగిర్ని, మినీ రైస్ మిల్లులు, గానుగనూనె తయారీ, జిరాక్స్, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్.. ఇలా అనేక రకాల అవకాశాలకు ఇన్నాళ్లు దూరంగా ఉన్నారు.
కొనసాగుతున్న పనులు..ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. బోథ్, ఆదిలాబాద్, ఉట్నూర్ నియోజకవర్గాల పరిధిలోని తండాలకు 11కేవీ లైన్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 50 సబ్స్టేషన్ల పరిధిలో 132/33/11 కేవీ సబ్స్టేషన్లవారీగా లోడ్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తండాలవారీగా 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 212 ఏర్పాటు చేస్తున్నారు.
పనులు కొనసాగుతున్నాయి..
ఆదిలాబాద్ జిల్లాలోని 443 తండాల్లో త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా పనులు కొనసాగుతున్నాయి. మరో 303 తండాలకు అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉంది. ప్రభుత్వం రూ.37 కోట్లు మంజూరు చేసింది. పనులు పూర్తయితే తండావాసుల్లో వ్యవసాయం అభివృద్ధి చేసుకోవచ్చు. పనులు పూర్తి చేసి తండాలకు కొత్త వెలుగులు ఇవ్వబోతున్నాం.
జాడే ఉత్తమ్, జిల్లా విద్యుత్శాఖ అధికారి, ఆదిలాబాద్.
746 తండాలకు త్రీ ఫేజ్..
ఆదిలాబాద్ జిల్లాలోని 746 గిరిజన తండాలకు త్రీఫేజ్ విద్యుత్ అందించనున్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో 443 తండాల్లో పనులు కొనసాగుతున్నాయి. మరో 303 తండాలకు అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తండాలకు టూఫేజ్ విద్యుత్ మాత్రమే అందిస్తున్నారు. దీంతో వ్యవసాయ బావులకు మోటర్లు అమర్చుకునే అవకాశం లేకుండాపోయింది. చాలా గిరిజన తండాల్లో వర్షాధార పంటలనే సాగుచేస్తున్నారు. ఇప్పుడు త్రీ ఫేజ్ సౌకర్యం వస్తే వరి సాగు పెరగనున్నది.