న్యూఢిల్లీ : కొవిడ్-19 మహమ్మారి కట్టడిలో నరేంద్ర మోదీ సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘం సీడబ్ల్యూసీ తీర్మానించింది. శాస్త్రీయ సలహాలను విస్మరించి మహమ్మారిపై విజయం సాధించినట్టు ముందుగానే ప్రకటించిందని ఎద్దేవా చేసింది. కరోనా సెకండ్ వేవ్ దేశంలో అసాధారణ ఆరోగ్య సంక్షోభానికి దారితీసిందని ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వ అసమర్ద విధానాలు, అరకొర నిర్వాకంతో కరోనాతో తీవ్ర విపత్తు ముంచుకొచ్చిందని సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ భేటీ తీర్మానించింది.
కొవిడ్ మరణాలపై ప్రభుత్వం తక్కవ చేసి చూపుతోందని తీర్మానం ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు, మందులు, దవాఖానలు అందుబాటులోని గ్రామీణ ప్రాంతాల్లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరిస్తుంటే ఆక్సిజన్ సరఫరాలు, మందులు, ఆరోగ్య మౌలిక వసతులపై ఖర్చు పెట్టని మోదీ సర్కార్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ముందుకు వెళ్లడం పట్ల సీడబ్ల్యూసీ తీర్మానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.