హైదరాబాద్ : డ్రగ్స్ బ్లాక్ దందాపై కఠినంగా వ్యవహరించాలి హోంమంత్రి మహమూద్ అలీ పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో పోలీసుశాఖ తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్లోని తన కార్యాలయంలో ఆయన బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ , సైబరాబాద్ సీపీ సజ్జనార్లతోపాటు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా మందుల కొరత లేదని తెలిపారు. ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్లు సరిపడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డ్రగ్స్ బ్లాక్ మార్కెట్ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అన్నారు.
రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని చెప్పారు. ముస్లింలు నమాజ్, తరావీలు చేసే సమయంలో భౌతికదూరం పాటించాలని కోరారు. లక్షణాలు ఉన్న వారు వెంటనే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కరోనాపై సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆపద కాలంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి పోలీసు శాఖకు పేరు తేవాలని సిబ్బందిని కోరారు. ప్రజలకు సేవలందించడంలో పోలీసులు ఎల్లప్పుడు ముందుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి