17, 20వ వార్డుల్లో ట్రీ పార్కులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల, ఏప్రిల్ 22: గతంలో ఏ ప్రభుత్వానికిరాని ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చి పురపాలక సంఘాల్లో ప్రతివార్డులో పార్కు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మంచి ఆహ్లాదకర వాతావరణంతోపాటు కాలక్షేపం లభిస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అ న్నారు. గురువారం పట్టణ ప్రగతిలో భాగంగా గద్వాల పురపాలక సంఘంలో 17, 20వ వార్డులో ఏర్పాటు చేసిన నూతన ట్రీ పార్కులను ఎమ్మెల్యే పురపాలక చైర్మన్ బీఎస్ కేశవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పల్లెలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు నాటి గ్రామ ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రభుత్వం నెలకొల్పిందన్నారు.
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు పురపాలక సంఘాల్లో ప్రతి వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా ప్రకృతి వనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలనీ ప్రజలు సాయంత్రం, ఉదయం కాలక్షేపం చేసేవిధంగా పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. చెట్లను పెంచడం వల్ల పార్కుకు వచ్చే వారికి మంచి ఆక్సిజన్ లభిస్తుందని చెప్పారు. వాకింగ్, యోగా, ధ్యానం చేసే విధంగా సౌకర్యాలు కల్పించామన్నారు. కుటుంబ సభ్యులు సా యంత్రం వేళ ఈ పార్కుల్లో సరదాగా సేద తీరవచ్చన్నారు. త్వరలో గద్వాల పురపాలక సంఘంలో అన్ని వార్డుల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వార్డు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వార్డు ప్రజలు అధికారులకు సహకరించాలని, అలాగే అధికారులు, ప్రజలను సమన్వయం చేసుకుని ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్లో గద్వాల పురపాలక సంఘాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జెడ్పీటీ సీ రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మహేశ్వరి త్యాగరాజు, నరహరిగౌడ్, నాగిరెడ్డి, కృష్ణ, శ్రీను, మహేశ్, జములమ్మ ఆలయ చైర్మన్ సతీశ్కుమార్ నాయకులు జానకీరాములు, సాయిశ్యాంరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
గద్వాల, ఏప్రిల్ 22: దివ్యాంగులమని ఎవరూ అధైర్య పడవద్దని, దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కోసం పింఛన్లతోపాటు వారి అవసరాలకు వివిధ రకాల అధునాతన ఉపకరణాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దివ్యాంగులకు ఏడీఐసీ పథకం కింద మంజూరైన ఉపకరణాలకు గద్వాల పురపాలక చైర్మన్ బీఎస్ కేశవ్తో కలిసి దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.అన్ని వర్గాలతోపాటు దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు.
గతంలో దివ్యాంగులకు రూ.500మాత్రమే పింఛన్ వచ్చేదని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1500, తరువాత రూ. 3వేలకు పెంచిందని చెప్పారు. దివ్యాంగులకు స్పింగ్ మోడల్ చంక కర్రలు రూ. 3వేలు వెచ్చించి అందించామన్నారు. రెండు కండ్లు లేని వారి కోసం రెండు మీటర్లు ముందు తెలియజేసే విధంగా ఉండే చేతి కర్ర ను, బ్యాటరీ ఆధారిత మూడు చక్రాల ట్రైసైకిళ్లు 46 మంది దివ్యాంగులకు అందించామన్నారు. వీటితోపాటు శారీరక వికలత్వం కలిగిన వారికి మూడు చక్రాల స్కూటీలు, వీల్చైర్లు, వినికిడి లోపం ఉన్నవారికి డైసిప్లేయర్లను దివ్యాంగులకు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో సుశీంధర్రావు, వైస్ చైర్మన్ బాబర్, జెడ్పీటీసీ రాజశేఖర్, ఎంఈవో సురేశ్, కౌన్సిలర్లు కృష్ణ, నాగిరెడ్డి, నరహరిగౌడ్, శ్రీను నాయకులు సాయిశ్యాంరెడ్డి, పవన్, వీరేశ్ పాల్గొన్నారు.