బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 20: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట విధించిన కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామని బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి అన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో స్థానిక వ్యాపారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 20 నుంచి మే ఒకటో తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించిందని తెలిపారు. ఇందులో భాగంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కఠినమైన ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. రాత్రి 8 గంటలకే అన్ని దుకాణాలను మూసివేయాలని, ప్రజలు బయటికి రావొద్దని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, సీఐ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, వ్యాపారులు పాల్గొన్నారు.
సరిహద్దుల్లో రాకపోకలను నియంత్రించాలి..
జుక్కల్ నియొజకవర్గంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దుల్లో రాకపోకలను నియంత్రించాలని డీఎస్పీ జైపాల్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. చెక్పోస్టులను ఏర్పాటుచేసి జుక్కల్, మద్నూర్ మండలాల వైపు ప్రజలను రానివ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో ఎస్సైలు, సీఐలు పాల్గొన్నారు.
ప్రజలు సహకరించాలి: ఎల్లారెడ్డి డీఎస్పీ
కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించిందని, ప్రజలు పూర్తిగా సహకరించాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు బయటికి రావొద్దని, అత్యవసర సేవలు మినహా రాత్రి 8 గంటలకే అన్ని దుకాణాలను మూసివేయాలని సూచించారు. బయటికి వెళ్లినవారు తప్పనిసరిగా రాత్రి 9 గంటలలోపు ఇండ్లకు చేరుకోవాలన్నారు. ఆదేశాలను బేఖాతరు చేస్తే చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొవిడ్ నిబంధనలపై అవగాహన..
మండల పరిధిలోని దేమెకలాన్, కరడ్పల్లి, బ్రాహ్మాజివాడి గ్రామాల్లో తహసీల్దార్ సునీత మంగళవారం పర్యటించి కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని చెప్పారు. 8 గంటలకే దుకాణాలను మూసివేయాలని సూచించారు.
నిజాంసాగర్లో..
నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పర్బన్న, తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్సై హైమద్ ఆధ్వర్యంలో వ్యాపారులు, నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. రాత్రి కర్ఫ్యూపై అవగాహన కల్పిస్తూ నిబంధనలను పాటించాలని సూచించారు. సమావేశంలో మండల పంచాయతీ అధికారి అబ్బాగౌడ్, ఆర్ఐ సాయిలు పాల్గొన్నారు.
తగిన ఆధారాలు తప్పనిసరి..
రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించినందున అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని తహసీల్దార్ రవీందర్ ఒక ప్రకటనలో సూచించారు. అందుకు తగిన ఆధారాలు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు. మే ఒకటో తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, రాత్రి 8 గంటలకే దుకాణాలను మూసివేయాలని సూచించారు.