పత్యేక ఇన్సెంటివ్ ఇచ్చి వైద్యులను భర్తీచేసుకోవాలి
రోజువారీ కాకుండా వారానికి సరిపడా ఇండెంట్ తీసుకోవాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
వైద్యాధికారులతో సమీక్ష
ఎదులాపురం ఏప్రిల్ 18: రిమ్స్ వైద్యులు సమన్వయంతో పనిచేస్తూ కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొవిడ్ బాధితులకు చిక్సిత అందజేస్తున్న వైద్యులతో సమావేశం నిర్వహించారు. ముందుగా రిమ్స్ వైద్యులు తమ సమస్యలు, ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ… కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించిన రోగులకు మానవత్వంతో వైద్యసేవలు అందించాలన్నారు. కొవిడ్ నేపథ్యంలో అవసరమైన వైద్యాధికారులను డిప్యుటేషన్పై తెప్పించుకోవాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలనధిగమించి రోగులకు సకాలంలో వైద్య సేవలందించాలన్నారు. రోగులతో పాటు వారి సంబంధీకులు ఎక్కువ సంఖ్యలో రిమ్స్కు వస్తున్నారని వారిని కట్టడి చేయడానికి పాస్ల విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వైద్య సిబ్బందిని వార్డులు, విభాగాల వారీగా కేటాయించాలన్నారు. వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి మాస్క్లు సరఫరా చేయాలని ఆదేశించారు. కొవిడ్ వార్డులో సేవలందిస్తున్న వైద్యులకు ప్రత్యేక విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్ బాధితులకు వైద్యుల సలహా మేరకే ఆక్సిజన్ వెంటిలేటర్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్లను అందించాలన్నారు. సెక్యూరిటీ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూడాలని ఆ ఏజెన్సీని ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగే విధంగా చూడాలన్నారు. బాధితులకోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారానికి సరిపడా ఇండెంట్ తీసుకోవాలన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో పని చేయడానికి ప్రత్యేక ఇన్సెంటివ్ ఇచ్చి వైద్యులను భర్తీచేసుకోవాలని తెలిపారు. రిమ్స్ నుంచి ఇంటికి వెళ్లిన కొవిడ్ బాధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రిమ్స్లో సెల్ సిగ్నల్ సరిగా ఉండనందున ఇంటర్ ఫోన్ సౌకర్యం కల్పించుకోవాలన్నారు.
వారం తరువాత మళ్లీ సమావేశముంటుందని వైద్యుల పని తీరు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ మాట్లాడుతూ టీమ్ వర్క్గా పని చేయాలన్నారు. సమయానుకూలంగా డైట్ సరఫరా చేయాలని తెలిపారు. రోగులకు సరైన సమయానికి మందులు అందించాలన్నారు. అనంతరం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ… రిమ్స్ నుంచి సహకారం అందించాలని, నోడల్ అధికారిగా తాను అడిగిన సమాచారం ఇవ్వాలన్నారు. రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ.. ఆర్టీపీసీఆర్ పరీక్షలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వైద్యుల సలహా మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రిమ్స్లో 110 ఐసొలేషన్ పడకలు, 295 ఆక్సిజన్ పడకలు, 105 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్లు సుమలత, తొడసం చందు, సందీప్జాదవ్, తానాజీ, శ్రీనివాస్, ప్రశాంత్, విజయ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.