కొండాపూర్, ఏప్రిల్ 17 : మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో శనివారం ఏర్పాటు చేసిన డిజైర్ సిల్క్ చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్. శోభ ముఖ్య అతిథిగా హాజరై ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కే. లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచిన చేనేత వస్ర్తాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అన్ని వర్గాల మహిళలు మెచ్చేలా తయారు చేసిన చేనేత వస్త్ర ఉత్పత్తులు ప్రదర్శనలో ఉన్నాయన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మాదాపూర్లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ చేనేత ఉత్పత్తులైన చీరలు కంచి, బెనారస్, చందురీ, కోల్కత, ప్యూర్ సిల్క్, కాటన్తో పాటు ఇతర చేనేత వస్ర్తాలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ఏప్రిల్ 26వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.