ఉచిత మంచినీటి పథకం అమలుకు జలమండలి అధికారులు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగర వాసులకు ఉచితంగా అందించనున్న 20 వేల లీటర్ల నీటి సరఫరా పథకాన్ని నిబంధనలు అనుసరించి అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగానూ డివిజన్లో ఆధార్ లింక్ కోసం 40 బృందాలను ఏర్పాటు చేసినట్లు జలమండలి జీఎం హరిశంకర్ తెలిపారు. ఆధార్ లింక్, మీటర్ల బిగింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు అధికారులతో కలిసి ఆయన యూసుఫ్గూడ సెక్షన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని సెక్షన్లలో ఆధార్ లింక్ దాదాపు 60 శాతం పూర్తి చేశారని, మరికొన్ని సెక్షన్లలో 100 శాతం పూర్తయిందని తెలిపారు. కాగా, ఇప్పటికే పాత మీటర్లు కొనసాగుతున్న గృహాలలో ఫిర్యాదులను పరిష్కరించేందుకు 90 మంది ప్రతినిధులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆయా బృందాలు ప్రతి వినియోగదారుడి ఇంటిని సందర్శించి, పాత మీటర్లుంటే వాటితోనే ఉచిత నీటి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. దీంతో పాటు కొత్త మీటర్లు బిగించుకోవడానికి ఒక్కో సెక్షన్కు మూడు టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీటర్ ఫిక్సింగ్ ఏజెన్సీల సమన్వయంతో డివిజన్లో 30 బృందాలు కొత్త మీటర్లు బిగించడంలో వినియోగదారులకు సేవలందించనున్నట్లు తెలిపారు. మల్టీ స్టోర్ బిల్డింగ్స్లో ఈ పథకం అమలుకు అపార్ట్మెంట్ యజమానులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. స్లమ్స్లో ఆధార్ లింక్ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు.
ఇప్పటి వరకు 32,863 కనెక్షన్లకు ఆధార్ లింక్ చేశామని, సుమారు మూడు వేల మీటర్లు బిగించామని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గృహానికి ఉచిత మంచినీటి పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీటి వినియోగదారులకు ప్రతి ఒక్కరికీ ఆధార్ లింక్, మీటర్లు అవసరమైనందున జలమండలి సిబ్బందికి సహకరించి ఈ పథకం అమలుకు సహకరించాలని కోరారు. ఏప్రిల్ 30తో పొడిగించిన గడువు ముగియనున్నందున ప్రతి నీటి వినియోగదారులు నిబంధనలు అనుసరించి మీటర్లు బిగించుకొని, తమ కనెక్షన్లకు ఆధార్ లింక్ చేసుకోవాలని కోరారు. డొమెస్టిక్, ఎంఎస్బీ కనెక్షన్లలో మీటర్లు బిగించుకున్న వినియోగదారులకే ఈ పథకం వర్తించనుండటంతో అధికారులు ఆయా పనులను వేగవంతం చేశారు. వినియోగదారుల క్యాన్ (కస్టమర్ అకౌంట్) నంబర్తో ఆధార్ లింక్ చేసుకునేందుకు జలమండలి వెబ్సైట్“www.hyderabadwater.gov.in”ను సందర్శించడంతో పాటు మీటర్ల బిగింపు తదితర అంశాలపై సమాచారానికి 155313 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించాలని జీఎం హరిశంకర్ కోరారు.