నిర్మల్ : ఐఏఎఫ్ అధికారిగా ఎంపికైన బెల్లంపల్లి అమ్మాయి చాముండేశ్వరి దేవిని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. బాలిక తల్లిదండ్రులతో మంత్రి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. బాలిక విజయంపై తాను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భారత వైమానిక దళం అధికారిగా ఎంపికవడం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందన్నారు. నీవు సాధించిన విజయానికి తెలంగాణ రాష్ట్రం గర్వపడుతుందన్నారు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాబుక్యాంపు బస్తీకి చెందిన చాముండేశ్వరి అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి భారత వాయుసేనలోని టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించి రికార్డు నెలకొల్పింది. తెలంగాణలో ఉన్న ఏకైక సాంఘిక సంక్షేమ సాయుధ దళాల కళాశాల నుంచి తొలిసారి ఉద్యోగం పొందిన యువతి చాముండేశ్వరి. బస్తీకి చెందిన గోపు విజయ్, శారద దంపతుల కుమార్తె చాముండేశ్వరి. విజయ్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ మోటర్ షోరూంలో గుమస్తాగా పని చేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు.