సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 8: కరోనా ఉధృతి నివారణకు విస్తృత చర్యలు చేపట్టాల ని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, జడ్పీ సీఈవో, డీఆర్డీవో, డీపీవో, డీఈవో, సంబధిత అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, టెస్టులు, వ్యాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ సెకండ్ వేవ్ ప్రస్తుతం ఆందోళనకరంగా విస్తరిస్తున్నందున నివారణ చర్యలు చేపట్టాలన్నారు. టెస్టులు, వ్యాక్సినేషన్ సం ఖ్యను పెంచాలన్నారు. పాజిటీవ్ వచ్చిన వారందరికీ హోమ్ ట్రీట్మెంట్ కిట్స్ అందించాలన్నారు. కరోనా విజృంభిస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారందరిని వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. టీకాతోనే 100శాతం రక్షణ లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వైద్యాధికారులు దృష్టి సారిస్తే వ్యాక్సిన్ అందించడంలో 100శాతం విజయం సాధిస్తామని వివరించారు. మండల స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి టెస్టులు చేయడం, వ్యాక్సిన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పారిశ్రామిక ప్రాంతాల్లోనే అధికం
జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నదని, అక్కడ ప్రత్యేక శ్రద్ధతో టెస్టులు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సరిహద్దు గ్రామాల వారిపై దృష్టి సారించాలన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న పరిధిలో పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా దవాఖానల పనితీరు బాగు లేనట్లయితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. లక్ష్యం మేరకు టెస్టులు చేయని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. గతంలో మాదిరిగానే ఐసొలేషన్లో ఉన్నవారికి మనోధైర్యాన్ని కల్పించాలని, హోమ్ ట్రీట్మెంట్ కిట్లు అందించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ ప్రాంతం వరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్ జన సమ్మర్థం గల ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేసి మాస్కులు ధరించని వారికి జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులకు వివరించారు. మాస్క్ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి దుకాణం ముందు మాస్కు లేనిది అనుమతించబడదు అనే బోర్డు ఉండాలని ఆదేశించారు. శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని, మాస్కు ధరించని వారికి రూ. వెయ్యి జరిమానా విధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్శీ షా, డీఆర్డీడీవో శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఈవో రాజేశ్, డీఏం అండ్ హెచ్వో గాయత్రీదేవి, ఆయా అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.