నిజామాబాద్, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ – శాక్త పరిషత్ సంయుక్తంగా నిర్వహించనున్న అధర్వణ వేద యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు ఏకధాటిగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ప్రధానంగా చతుర్వేద సదస్సుతో పాటు లోక కళ్యాణం కోసం అధర్వణ యాగాన్ని పండితుల సమక్షంలో నిర్వహించనున్నారు. వేదాలను అవసోపాన పట్టిన పండితుల సమక్షంలో వేద పాఠశాలల్లో అనేక పురాణ ఇతిహాస గ్రంథాలను, సంస్కృత పాఠాలను కంఠస్థం చేసిన విద్యార్థులకు పరీక్షలు సైతం నిర్వహించనున్నారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల యొక్క గొప్పతనాన్ని భావి తరాలకు చాటి చెప్పడంతో పాటు సమస్త ప్రజానీకానికి మంచి జరగాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజామాబాద్లోని శ్రద్ధానంద్ గంజ్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో అథర్వణ వేద యాగం జరుగనుంది. యాగం కోసం శాక్త పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. హోమ గుండాలను నిర్మించారు. తొలి రోజు గణపతి పూజతో కార్యక్రమం ఆరంభం అవుతుంది.
మూడు రోజుల విశిష్టతలు ఇవీ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు వేద పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వేద పండితుల సమక్షంలో అధర్వణ వేద యాగాన్ని తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ – శాక్త పరిషత్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. అధర్వణ యాగాన్ని నిర్వహించడం చాలా అరుదు. ప్రజా సంక్షేమాన్ని, సమాజ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ చెడును పారదోలి.. మంచిని ఆహ్వానించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. గురువారం ఉదయం 8గంటలకు గురు ప్రార్థనతో చతుర్వేద సదస్సు, చతుర్వేద పరీక్షలు ప్రారంభం అవుతాయి.
అనంతరం గణపతి పూజ, పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, అరణి మథనపూర్వక అథర్వణవేద యాగ అగ్ని ప్రతిష్ఠను నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు చతుర్వేద పరీక్షలు జరుగుతాయి. అనంతరం సంకీర్తనలు, నాచారం – శ్రీపీఠం మధుసూదనానంద సరస్వతీ స్వామి, శాస్ర్తుల వెంటకేశ్వర శర్మ, దెందుకూరి నారాయణ శ్రౌతి, విద్వాన్ నంబీ వాసుదేవాచార్యులతో వేద భాష్యం ప్రవచనాలు ఉంటాయి. రెండో రోజు శుక్రవారం రోజున చతుర్వేద పరీక్షలతో పాటు భజనలు నిర్వహిస్తారు. మంగళంపల్లి వేణుగోపాల శర్మ, గుదిమెల్ల మురళీకృష్ణమాచార్యులు, బాచంపల్లి సంతోష్ కుమార్ ప్రవచనాలు ఉంటాయి. మూడో రోజు శనివారం అథర్వణవేద యాగ పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉమామహేశ్వర స్వామికి మహా రుద్రాభిషేకం చేస్తారు. వంశీకృష్ణ ఘనాపాఠితో వేద సభ నిర్వహిస్తారు. చతుర్వేద పరీక్షల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి జయపత్రికలతో సత్కరిస్తారు.
వేదాధ్యాయపు పరీక్షలు..
ప్రతి సంవత్సరం వేదాధ్యాయం పూర్తి చేసిన వారికి పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణతను అనుసరించి, వారికి యోగ్యతా పత్రం, సంభావనాదికములతో సత్కరించడం ఆచారంగా వస్తున్నది. ఈ పరీక్షలను నిష్ణాతులైన పరీక్షాధికారులతో నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్లో ఉన్న ఉమామహేశ్వరాలయంలో మూడు రోజుల పాటు వైధిక పఠనం చేస్తున్న ఆయా వేద పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉపయోగపడేలా పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేద శాస్త్ర ప్రవర్ధక సభలో నాలుగు వేదాల్లో వేద పఠనం చేస్తున్న విద్యార్థులను పరీక్షల కోసం ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 వేద పాఠశాలలకు చెందిన పండితులు, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. పట్లూరు మాణిక్య సోమయాజితో పాటు సూర్యనారాయణ ఘనాపాఠి(రుగ్వేదం), కేదార్నాథ్ ఘనాపాఠి(యజుర్వేదం), సుందరరామ శ్రౌతి(సామవేదం), వేలేటి సిద్ధ రామేశ్వర శర్మ(అథర్వణ వేదం) పరీక్షాధికారులుగా వ్యవహరిస్తారు.
మూడు రోజుల పాటు కార్యక్రమాలు..
తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ, శాక్త పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు చతుర్వేద సదస్సు, అథర్వణ వేద యాగం నిర్వహిస్తున్నాం. శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో విధుశేఖర భారతీ మహాస్వామి వారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. కొవిడ్ 19 నిబంధనలు అనుసరించి చతుర్వేద సదస్సు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేద పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైతం హాజరవుతారు.
లోక కళ్యాణార్థమే యాగం..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కంటికి కనిపించని శత్రువుతో పోరాటం జరుగుతున్నది. భూమిపై బతుకుతున్న ప్రతి ప్రాణి బాగు కోసం, లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ అథర్వణ వేద యాగం నిర్వహిస్తున్నాం. పండితులు, వేద గురువులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఏప్రిల్ 8 తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.
ఇవీ కూడా చదవండీ…
రైతు సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయం