న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా సూపర్ స్ప్రెడర్గా మారుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో కరోనా వ్యాప్తిపై సోమవారం జరిగిన కార్యదర్శుల స్ధాయి భేటీలో ఓ ఉన్నతాధికారి కుంభమేళా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు ఏఎన్ఐ పేర్కొంది.
నిర్ణీత వ్యవధి కంటే ముందుగా కుంభమేళాను ముగించని పక్షంలో ఇది కొవిడ్-19 సూపర్ స్ప్రెడర్గా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కుంభమేళాను సందర్శించే క్రమంలో యాత్రికులు మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించేలా మత పెద్దలు, సాధువుల సాయం తీసుకునేలా కేంద్రం ఓ బృందాన్ని నియమించనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం పెద్ద ఎత్తున ప్రచార, అవగాహనా కార్యక్రమాలు చేపట్టనుంది. అయితే కుంభమేళాను ముందుగానే ముగించేందుకు ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.