మన రైతులు పండించిన చాలా పంటలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఎగుమతి చేసే అవకాశం లేకపోవడం, వ్యయప్రయాస కావడంతో విదేశాలకు ఎలా పంపించాలో తెలిసేది కాదు. ఈ ఇబ్బందులను తప్పించి రైతు పొలం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు ఎయిర్పోర్టులో కార్గో కేంద్రం ఏర్పాటుకు జీఎంఆర్ సంస్థ అంగీకరించింది. ఆర్టీసీ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ, జీఎంఆర్ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదరడంతో ఎయిర్పోర్టులో కార్గో కేంద్రాన్ని ఏర్పా టు చేశారు. దీంతో రైతు ఎవరైనా పంట పొలం నుంచే నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసుకొని లాభాన్ని ఆర్జించవచ్చు. ప్రధానంగా పండ్లు, బాస్మతి బియ్యం వంటి పలు రకాల పంటలను ఆసియా దేశాలకు అతితక్కువ ఖర్చుతో ఎగుమతి చేయవచ్చు.
పంటలను ఆసియా దేశాలకు ఎగుమతి చేయాలంటే రైతుకు రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యేవి. తప్పనిసరిగా ప్రైవేటు వాహనాలతోనే ఎయిర్పోర్టుకు సరుకు చేరవేసేవారు. దీనివల్ల గిట్టుబాట ధర వచ్చేది కాదు. ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్సీసుల వల్ల రైతులకు 50 శాతం వరకు చార్జీలు తగ్గుతాయని కార్గో ఇన్చార్జి కృష్ణకాంత్ తెలిపారు. ప్రధానంగా గిట్టుబాటు ధర రాని టమాటాను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసుకోవచ్చన్నారు. ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలు ఉపయోగించుకోవాలనుకున్న రైతులు ఆర్గానిక్ పంటలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇతర దేశాల్లో ఆర్గానికి ఫుడ్కు మంచి డిమాండ్ ఉండడమే ఇందుకు కారణమన్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో అధిక డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే ఎగుమతి చేసేలా ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ రైతులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన చెప్పారు.