రాత్రి సమయాల్లో ఉద్యోగినులు, మహిళలకు అండగా సైబరాబాద్ షీ టీమ్స్ గస్తీ కాస్తున్నాయి. పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలతో సైబరాబాద్ పరిధిలో రాత్రి సమయాల్లో షీ టీమ్స్ పెట్రోలింగ్ను నిర్వహిస్తున్నాయి. రాత్రి వేళల్లో పోకిరీలు వేధించే దాదాపు 50కి పైగా హాట్ స్పాట్లను గుర్తించారు. ఈ హాట్స్పాట్ల్లో షీ టీమ్స్ గస్తీని నిర్వహిస్తున్నాయి. అలాగే… మఫ్టీలో షీ టీమ్స్ బృందాలు హాట్స్పాట్ల్లో నిఘా పెట్టాయి. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రిపూట షీ టీమ్స్ తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాలు రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నజర్ను పెట్టారు. ఈ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఉద్యోగినులు ఇంటికి వెళ్లే సమయంతో పాటు రాత్రి షిఫ్టులో విధులకు వచ్చేవారు అధికంగా ఉండటంతో షీ టీమ్స్ ఇక్కడ పెట్రోలింగ్ను నిర్వహిస్తుంది.
ఇటీవల ప్రారంభమైన షీ టీమ్స్ రాత్రి గస్తీ ఇప్పటికే 9 కేసులను నమోదు చేసింది. వీరంతా హాట్స్పాట్ల్లో నిలబడి ఉద్యోగినులను వేధించడంతో వారిని అరెస్ట్ చేసింది. ఇంతకుముందు డయల్ 100కు ఫోన్ రాగానే వెళ్లే సైబరాబాద్ షీ టీమ్స్.. పిలువకముందే ఇప్పుడు హాట్ స్పాట్స్ల్లో తిష్ట వేస్తున్నారు. అక్కడ పోకిరీలు చేసే వెకిలి చేష్టలను వీడియో చిత్రీకరించి.. వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. షీ టీమ్స్ ఇప్పుడు రాత్రిపూట ఉద్యోగినులకు, మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. రాత్రి సమయాల్లో హోటళ్లు, టీ పాయింట్లు, బస్టాప్లు, కార్పొరేట్ కార్యాలయాలు, సినిమా హాళ్లు, ఇలా అనేక హాట్ స్పాట్ల్లో షీ టీమ్స్ ఉంటున్నాయి. దీంతో ఇప్పుడు షీ టీమ్స్ 24/7 కింద విధులు నిర్వహిస్తూ ఉద్యోగినులు, మహిళలు, యువతులకు పూర్తి భద్రత కల్పిస్తున్నాయి.