న్యూఢిల్లీ: రాజ్యసభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. 253వ రాజ్యసభ సమావేశాలు ముగిసినట్లు చైర్మెన్ వెంకయ్యనాయుడు తెలిపారు. కోవిడ్ నిబంధలు పాటిస్తూ నిర్వహించిన రెండవ సెషన్ అని చెప్పారు. 23 సిట్టింగ్లతో సభ ముగించినట్లు తెలిపారు. మొత్తం 104 గంటల పాటు సభా కార్యకలాపాలు జరిగాయి. హౌజ్ ప్రొడక్టివిటీ 99 శాతం ఉన్నట్లు ఆయన చెప్పారు. విపక్ష సభ్యుల అవాంతరాల వల్ల సభ సుమారు 21 గంటల పాటు జరగలేదన్నారు. ఈ బడ్జెట్ సెషన్లో మొత్తం 19 బిల్లులు పాసైనట్లు వెంకయ్య వెల్లడించారు.
వాయలార్ భావోద్వేగం..
చివరి రోజు సందర్భంగా ఎంపీలు వాయలార్ రవి, కేకే రాగేశ్, అబ్దుల్ వాహబ్లకు ఫేర్వెల్ పలికారు. ఆ ముగ్గురికీ చైర్మన్ నివాళి అర్పించారు. వాళ్లు సభను వీడి వెళ్తున్నా.. వాళ్లు సభకు అమూల్యమైన భాగస్వామ్యాన్ని అందించారన్నారు. వాళ్లు కేవలం రిటైర్ అవుతున్నారని, అలసిపోలేదన్నారు. కేరళకు చెందిన వాయలార్ రవి .. నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫేర్వెల్ సందేశం వినిపించిన ఎంపీ రవి.. సభలో భావోద్వేగానికి లోనయ్యారు.