సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో అడ్డదిడ్డంగా వాహనాల రాకపోకలు
ఇప్పటికే ఈ చౌరస్తాలో పలు ప్రమాదాలు n గతంలోనే బ్లాక్స్పాట్గా గుర్తింపు
సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలంటున్న వాహనదారులు
కంది, మార్చి 23 : కంది మండల కేంద్రంలోని చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారింది. సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో వాహనదారులు అడ్డదిడ్డంగా వెళ్తున్నారు. దీంతో వాహనాలు ఢీకొంటున్నాయి. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు గతంలోనే బ్లాక్ స్పాట్గా కూడా గుర్తించారు. ట్రాఫిక్తో పాటు చౌరస్తా చుట్టు పక్కనే తహసీల్దార్ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, జడ్పీటీసీ కార్యాలయం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రధానంగా ఎన్హెచ్ 165 (హైదరాబాద్-ముంబాయి) కావడంతో ఈ రహదారిపై రోజుకు వేల సంఖ్యలో పెద్ద వాహనాలతో పాటు ఇతర కార్లు, ద్విచక్ర వాహన దారులు రాకపోకలు సాగిస్తుంటారు. తహసీల్దార్ కార్యాలయం, గ్రామ పంచాయతీ భవనం ఈ చౌరస్తాకు ఎదురుగానే ఉండడంతో అక్కడకి వెళ్లేటప్పుడు త్రీవ ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొంటున్నాయి. మరో వైపు ఈ చౌరస్తా నుంచే కంది – శంకర్పల్లి ఫోర్లేన్ రోడ్డు ఉండడంతో అటు హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్ వైపు వెళ్తున్న వారందరూ సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నారు. నెల రోజుల వ్యవధిలోనే చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్తో ట్రాఫిక్ కంట్రోల్ చేయించేలా పోలీసులు కృషి చేస్తున్నా అది అంతగా ఫలించడం లేదు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు.
ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు కృషి
కంది చౌరస్తాను గతంలోనే బ్లాక్స్పాట్గా గుర్తించాము. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు నిధుల కోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కోరాము. నిధులు సమకూరిన వెంటనే త్వరలోనే ఈ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేస్తాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. – ఏ.బాలాజీ, సంగారెడ్డి డీఎస్పీ
అందరి సహకారాన్ని కోరాం..
కంది ప్రధాన కూడలి వద్ద నిత్యం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు అరికట్టడంతో పాటు స్థానిక ప్రజల సమస్యలు కూడా తీరుతాయి. ఈ విషయంపై ఇప్పటికే పలువురు దాతల సహకారాన్ని కోరాము. త్వరలోనే అందుకు అయ్యే ఖర్చు సంబంధించిన నిధులను సేకరించి సిగ్నల్ ఏర్పాటు చేసేలా చూస్తాం.