‘అనంత విశ్వంలో మనమున్నాం. మనలోనూ విశ్వం దాగి ఉంది. పంచభూతాల నిలయం మానవ దేహం. అదే ఈశ్వర తత్త్వం. ఈ దేహమే దేవాలయం, జీవుడే దేవుడు!’ అంటూ భక్తుల మానసిక వికాసానికి జీవితాంతం కృషి చేసి, గురుపీఠం గౌరవాన్ని పెంచిన పరమయోగి సంత్ శ్రీ పూలాజీ బాబా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరుకు 30 కి.మీ. దూరంలోని పాట్నాపూర్లో ‘శ్రీ సిద్ధి యోగపీఠం శ్రీసిద్ధేశ్వర సంస్థానం’ నెలకొల్పారు. 500కు పైగా ధ్యాన కేంద్రాల స్థాపనకు మూల పురుషుడాయన.
‘శరీరంలోని కుండలినీ శక్తిని ఉత్తేజితం చేయాలని, ఇడ పింగళ సుషుమ్నా నాడుల త్రివేణి సంగమమైన భృకుటివద్ద మనసును ఏకీకృతం చేస్తే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంద’న్నది సంత్ శ్రీ పూలాజీ బాబా బోధన. దానిద్వారా భగవత్ సాక్షాత్కారం లభించి ప్రశాంత జీవితం పొందగలరని ఆయన ఉద్బోధించారు. కులమతాలకు అతీతంగా మానవత్వం, ధర్మాచరణల ద్వారానే మనుషుల్లో భగవంతుడిని చూడవచ్చునని అన్నారు.
1925 ఆగస్టు 30న మహారాష్ట్రలోని పర్భణిజిల్లా ఔండ్ నాగనాథ్ తాలుకా సావళి (బాయనరావు) గ్రామంలో శ్రీమతి పుంజాబాయి- దోండోబా ఇంగ్లే పుణ్యదంపతులకు పూలాజీ బాబా జన్మించారు. చిన్న వయసులోనే వారి తండ్రి ఇంగ్లే బతుకు తెరువుకోసం పాట్నాపూర్కు వలస వచ్చారు. వ్యవసాయం చేస్తూ, గ్రామాలు మారుస్తూ ఒడుదొడుకులతో జీవనం సాగించారు. చివరకు 1945లో పాట్నాపూర్లో స్థిరపడ్డారు. పూలాజీ తల్లి పుంజాబాయి గొప్ప భక్తురాలు. భజనలు, పూజలు, సత్సంగాలతో ఆమె భగవత్ సాక్షాత్కారం పొందినట్లు చెప్తారు. ఆమె చేష్టలను ప్రజలు పిచ్చిగానేకాక బాణామతిగానూ వక్రీకరించేవారు. గురూజీ గణపతి వాడ్గురే సహవాసం, తల్లి బోధనలు పూలాజీలోని జ్ఞానాన్ని మేల్కొల్పాయి. వాల్మీకి, వేమనల వలె ఆదివాసీ సంప్రదాయానికి చెందిన బాబా సాధారణ జీవనాన్ని త్యజించి ములంగి తపోవనంలో చాలాకాలం పాటు ‘పంచాగ్ని యోగసాధన’ చేసినట్లు తెలుస్తున్నది. వేదాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసి, పూర్తి స్థాయిలో యోగిగా మారారు.
కోటీశ్వరులు మొదలు కటిక దరిద్రుల వరకు అనేకులు పూలాజీ బాబా బోధనలతో తమ జీవితాలను మార్చుకొన్నారు. చెడు అలవాట్లు వదిలారు. మధుమాంసాల వినియోగం పూర్తిగా మానివేశారు. ఆచార సంప్రదాయాలలో కొన్ని సందర్భాల్లో కులపెద్దల నిరసనలు ఎదుర్కొన్నారుకూడా. అయినా, ఆయన చలించలేదు. పూలాజీ బోధనలు ఎందరిలోనో ఆత్మవిశ్వాసం నింపాయి. విమర్శించిన వాళ్ళే వారి పాదాక్రాంతులయ్యారు. ఆయన భక్తులెందరో నేటికీ సన్మార్గంలో జీవిస్తూ సమాజానికి ఆదర్శమవుతున్నారు. ‘పరమయోగి పరమహంస’గా ప్రసిద్ధి కెక్కిన వారి మాటలు నిజమయ్యేవనీ అంటారు.
2018 డిసెంబర్ 25న తనువు చాలించేదాక నిరాడంబరంగానే జీవిస్తూ, దర్పానికి, డాంబికానికి లొంగలేదు. పేదల్లో మూఢ నమ్మకాలకు చరమగీతం పాడి సత్ప్రవర్తనను పెంచి, వందలాది ధ్యానకేంద్రాల్లో లక్షలాది హృదయ మందిరాల్లో తరతరాలకు తరగని వెలుగుగా, వేల్పుగా సుస్థిరస్థానం సంపాదించుకొన్నారు.
-మాడుగుల నారాయణమూర్తి ,94411 39106