పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యం
కేంద్రం కోత పెడితే.. రాష్ట్రం కడుపు నింపింది
త్వరలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట జోన్/సిద్దిపేట అర్బన్ (మార్చి 19) : సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మండల, జిల్లా పరిషత్లకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించామని, స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులోని సుభాష్నగర్, పద్మానగర్, శ్రీరాంనగర్, ఇందిరానగర్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రూ.20 లక్షలతో ప్రహరీ నిర్మాణానికి, రూ.30 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కాళ్లకుంట కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన ముస్లిం కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. 9వ వార్డు రంగధాంపల్లిలో సుతారిసంఘం, మహిళా మండలి భవనాలను మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు శ్రీనివాస్యాదవ్, బర్ల మల్లికార్జున్, ఉమారాణి ఐలయ్యయాదవ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించామన్నారు. ఒక్క రంగధాంపల్లిలోనే 12 కమ్యూనిటీ భవనాలు నిర్మించామని,. రూ.9 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు రూ.699 కోట్లు కోత పెడితే, రా్రష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి కడుపు నింపిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఐటీ పార్కుకు నిధులు కేటాయించామని, మిట్టపల్లి, మందపల్లి, ముండ్రాయి పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పార్టీలకతీతంగా స్థానిక సంస్థలకు నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పట్టణాల అభివృద్ధికి ప్రతినెలా రూ.148 కోట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఇచ్చే వాటిలో రూ.699 కోట్లను కోత పెడుతుందని, సీఎం కేసీఆర్ చొరవతో స్థానిక సంస్థల అభివృద్ధి నిరాటంకంగా జరగాలనే లక్ష్యంతో ప్రతి నెలా నిధులు విడుదల చేస్తునట్లు తెలిపారు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందన్నారు. పట్టణాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి రూ.500 కోట్లు, వైకుంఠధామాల నిర్మాణాలకు రూ.200 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సమన్వయంతో పనిచేసి నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట పట్టణం ఇతర పట్టణాలకు ఆదర్శంగా ఉందని, త్వరలోనే రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రైల్వే సేవలు అందుబాటులోకి వస్తే గోదాములు, పరిశ్రమలు వస్తాయని, రంగధాంపల్లి ఏరియాలో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు రానున్నాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు ముత్యాల కనకయ్య, కౌన్సిలర్లు గ్యాదరి రవీందర్, టీఆర్ఎస్ నాయకులు సురేశ్, శ్రీనివాస్గౌడ్, గిరియాదవ్, తిరుమల్రెడ్డి, దుర్గారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కులసంఘం భవనాలు ఆత్మ గౌరవానికి ప్రతీకలు
కులసంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకలని, సిద్దిపేటలో ప్రతి కుల సంఘానికి భవనాలు నిర్మించామని మంత్రి హరీశ్రావు అన్నారు. రూ.40 లక్షలతో సిద్దిపేట పట్టణంలోని రేణుకానగర్లో నిర్మించిన సిద్దిపేట పట్టణ పూసల సంఘం కృష్ణ బలిజ భవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పూసల సంఘ భవనం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, సంఘ నిర్వహణను బాధ్యతతో నిర్వర్తించాలన్నారు. ఈ భవనాలు ప్రేరణ, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రూ.500 కోట్లను బడ్జెట్లో కేటాయించామన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ.50 వేల రుణాలను అందించామన్నారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం, మాజీ సర్పంచ్ సత్యం, పూసల సంఘం నాయకులు వెంకటేశం, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
నాచారం లక్ష్మీనర్సింహాస్వామిఉత్సవాల పత్రిక ఆవిష్కరణ
గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం నాచారం లక్ష్మీనర్సింహాస్వామి ఉత్సవాల పత్రికను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో పాటు దేవస్థాన పాలకమండలి సభ్యులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.