ముంబై: తండ్రి రెండవ పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి గురించి ప్రశ్నించే హక్కు కూతురికి ఉంటుందని బాంబే హై కోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. జస్టిస్ ఆర్డీ ధనూకా, జస్టిస్ వీజీ బిస్ట్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 66 ఏళ్ల కూతురు వేసిన కేసులో కోర్టు ఈ విధంగా స్పందించింది. 2003లో ఆమె తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె తండ్రి 2015లో మరణించాడు. కానీ తన తండ్రిని పెళ్లి చేసుకోవడానికి ముందే.. తన సవతి తల్లి మరొకర్ని పెళ్లి చేసుకున్నట్లు గుర్తించింది. విడాకులు తీసుకోకుండానే తన తండ్రిని రెండవ పెళ్లి చేసుకున్నదని, ఆస్తి కోసం తన తండ్రిని వేధించినట్లు ఆ మహిళ తన కేసులో ఆరోపించింది. తన తండ్రి మానసిక పరిస్థితి సరిగా లేదని, దాన్ని తన సవతి తల్లి ఆసరగా తీసుకుని తన తండ్రిని మోసం చేసినట్లు ఆ మహిళ తన పిటిషన్లో తెలిపింది.
పెళ్లి చేసుకున్న తర్వాత తన తండ్రి నుంచి తన సవతి తల్లి అనుచిత మార్గాల్లో ఆస్తులను లాగేసుకున్నట్లు ఆమె పేర్కొన్నది. వారసత్వంగా ఆస్తి దక్కాల్సిన వారికి కాకుండా.. మరొకరికి ప్రాపర్టీలు వెళ్లే విధంగా తన సవతి తల్లి ప్రవర్తించినట్లు ఆ మహిళ వెల్లడించింది. తన తండ్రి చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదంటూ ఆ మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఆ మ్యారేజ్ను కొట్టివేయాలని ఆమె కోర్టును కోరింది. కానీ 1984లోనే తాను విడాకులు తీసుకున్నట్లు సవతి తల్లి కోర్టుకు చెప్పింది. ఒకవేళ పెళ్లిని అడ్డుకోవాలంటే. పెళ్లి అయిన మూడేళ్ల లోపే కోర్టుకు వెళ్లాల్సి ఉండే అని ఆమె సవతి తల్లి ఫ్యామిలీ కోర్టుకు పేర్కొన్నది.
ఈ కేసులో 43 పేజీల తీర్పును ఇచ్చిన బాంబే హైకోర్టు.. తన తండ్రి రెండవ పెళ్లి గురించి ప్రశ్నించే హక్కు కూతురుకు ఉన్నట్లు పేర్కొన్నది. ఫ్యామిలీ సభ్యుల నుంచి దావాలు వేసేందుకు అడ్డంకులు ఏమీ లేవని హై కోర్టు చెప్పింది. తండ్రి చనిపోయిన తర్వాతనే తనకు రెండవ పెళ్లి గురించి తెలిసిందని, అందుకే ఆ మహిళ కోర్టును ఆశ్రయించవచ్చు అని హైకోర్టు వెల్లడించింది. ఫ్యామిలీ కోర్టు మళ్లీ ఆ కేసును విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.