భారత రాజ్యాంగ విలువలకు క్విట్ ఉద్యమ తీర్మానమే ప్రాతిపదిక అని ప్రధాని పీవీ నరసింహారావు విపులీకరించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్వర్ణోత్సవాల సందర్భంగా 1992 ఆగస్టు పదవ తేదీన ప్రధాని పీవీ బొంబాయిలో ప్రసంగిస్తూ- నాటి ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. గాంధీజీ ఉద్యమాన్ని నిర్వహించిన క్రమాన్ని, బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి పెట్టక తప్పని పరిస్థితి ఎలా వచ్చిందీ పీవీ తన ప్రసంగంలో స్పష్టంగా వెల్లడించారు. విద్యార్థులు క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని తప్పకుండా చదవాలని కూడా ఆయన సూచించారు.
క్విట్ ఇండియా ఉద్యమం ఒకేసారి ఉవ్వెత్తున రాలేదు. సుదీర్ఘ చరిత్ర ఉన్నది. సహాయ నిరాకరణోద్యమం, భంగమైన వాగ్దానాలు, కల్లలైన కలలు, బ్రిటిష్ ప్రభుత్వంపై భారతీయుల అనుమానాలు అన్ని కలిసి ఈ ఉద్యమానికి పునాది వేశాయి.
1914 మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే బ్రిటిష్ వారి పట్ల భారతీయుల్లో అసంతృప్తి మొదలైంది. యుద్ధ ప్రయత్నాలకు తాము మనస్ఫూర్తిగా మద్దతిస్తామని కాంగ్రెస్ నాయకులు స్వయంగా ప్రకటించారు. ఇది షరతులు పెట్టడానికి తగిన సమయం కాదని, గాంధీజీ ప్రతి ఒక్కరిని ఒప్పించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి బేషరతుగా సహకరించాలని కోరారు. దీంతో మొదటి ప్రపంచయుద్ధంలో 10 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. కనీసం 37 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి యుద్ధం చేస్తున్నామని బ్రిటిష్ వారు చెప్తున్నందువల్ల యుద్ధం ముగిసిన వెంటనే మనకు స్వాతంత్య్రం ఇవ్వవలసింది. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని గాంధీ ఉద్యమించారు. రెండవ ప్రపంచయుద్ధం వస్తుందని బ్రిటిష్ వారు ఊహించి ఉండరు. కానీ, 22 ఏండ్ల తర్వాత రానే వచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత స్వాతంత్య్రం ఇస్తామని ఈసారి బ్రిటిష్వారు అనలేదు. పైగా నిర్వీర్యమవుతున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి నాయకుడిగా ఉండదల్చుకోలేదని ప్రధాని చర్చిల్ అన్నారు. ఏదో ఒక్కటి చేయాలని భారతీయులు భావించసాగారు. బ్రిటిష్ గవర్నమెంట్ను నమ్మకూడదని భావించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యం ఇది.
మహాత్మా గాంధీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు. మీరు ఏ విలువల కోసం పోరాడుతున్నారో అందుకు ఒక బానిస రాజ్యం సహకరించలేదని ఆయన స్పష్టం చేశారు. మాకు స్వాతంత్య్రం ఇచ్చినట్టయితే మీ సైన్యం మా దేశంలో ఉండవచ్చు. మేం అన్నివిధాలా సహకరిస్తాం. కానీ, పోస్ట్ డేటెడ్ చెక్కులు మాత్రం స్వీకరించం అని గాంధీజీ తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం నాయకులందరినీ అరెస్టు చేసింది. ప్రభుత్వం అందరిని అరెస్టు చేయవచ్చునని గాంధీజీ ముందే దేశ ప్రజలను హెచ్చరించారు. నేను అప్పుడు నాగ్పూర్లో చదువుకుంటున్నాను. నాయకులు ఎప్పుడు అరెస్టు అవుతారు, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది రోజూ చర్చించుకునేవారం. తాము అరెస్టయిన తర్వాత ప్రజలతో సంబంధాలు పెట్టుకోలేమని ప్రతి ఒక్కరు తామే ఉద్యమ నాయకులుగా భావించుకోవాలని గాంధీజీ ముందే తెలిపారు. అందువల్ల కేంద్రీయ కార్యాచరణ లేకుండానే గ్రామాలలో పట్టణాలలో ప్రజలు తమకు తామే ఉద్యమించారు. ఇలా కొన్ని నెలలు సాగింది. నాయకులను అరెస్టులు చేసినా ఉద్యమం నడిచింది. ఉద్యమాన్ని అణచివేసినా ఎక్కువ కాలం దేశాన్ని పాలించలేమని బ్రిటిష్వారికి అర్థమైంది. ఇక స్వాతంత్య్రం ఇవ్వాలనే నిర్ణయానికి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది.
1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని విద్యార్థులందరూ బట్టీ కొట్టాలి. అది దేశ స్వాతంత్య్రం గురించి మాత్రమే చెప్పలేదు. భారతదేశ స్వాతంత్య్రం ఇతర వలసల విముక్తికి కూడా దారితీస్తుందని ప్రకటించింది. స్వప్రయోజనం కోసం పోరాడటం లేదని మాకో దృక్కోణం, స్వప్నం ఉందని, దేశంలో, ప్రపంచంలో సమానత్వం ఉండాలని ఒక దేశాన్ని మరో దేశం దోచుకోకూడదని స్పష్టం చేసింది.
ఈ కాలంలో ఒక్క ఉద్యమం ప్రారంభిద్దామనుకుంటే ఒక తీర్మానం చేసి మరచిపోతాము. ఆ తర్వాత కార్యాచరణ ఉండదు. కానీ, గాంధీజీ ఎంతో కాలం ముందుగా కార్యాచరణ సిద్ధం చేశారని హరిజన్ పత్రిక సంచికలు చూస్తే తెలుస్తుంది. ప్రతి సంచికలో తిప్పికొట్టలేని బలమైన వాదనలు వినిపించేవారు. ఆ విధంగా ప్రభావవంతమైన ఉద్యమాన్ని నిర్మించారు. ఇప్పుడు గాంధీ గానీ, నెహ్రూ గానీ తిరిగిరారు. వారి వారసులుగా మనమే ఆ కృషిని కొనసాగించాలి. 1942 నాటి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం. నేటి కార్యక్రమాలను అదే ఉత్సాహంతో ముందుకుతీసుకుపోదాం.
– పీవీ నరసింహారావు