ప్రత్యేక ప్రతినిధి, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది వాణిజ్యపన్నులశాఖ రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతున్నది. వస్తు, సేవలపన్ను (జీఎస్టీ), విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారా మొదటిసారిగా రూ.50 వేల కోట్ల మార్క్ను దాటబోతున్నట్టు స్పష్టమవుతున్నది. గతేడాది వాణిజ్య పన్నుల రాబడి రూ.47వేల కోట్లుగా ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం మరో నెల మిగిలి ఉండగానే రూ.46 వేల కోట్లు దాటింది. తెలంగాణ ఆవిర్భవించిన మొదటి ఏడాది ఇది రూ.27వేల కోట్లుగా ఉన్నది. సీఎం కేసీఆర్ ఆధీనంలో ఉన్న వాణిజ్యపన్నులశాఖ గత నాలుగు నెలలుగా చేపడుతున్న స్పెషల్డ్రైవ్ సత్పలితాలనిస్తున్నది. కొవిడ్ సంక్షోభం కారణంగా ఆర్థిక సంవత్సరం ఆరంభంలో భారీగా తగ్గిన జీఎస్టీ, వ్యాట్ వసూళ్లు ఈ నాలుగు నెలల్లో రికార్డుస్థాయిలో పుంజుకున్నాయి. కరోనా సంక్షోభాన్ని తట్టుకుని సొంత రాబడులను అతి తక్కువ కాలంలో పెంచుకుని ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా కోలుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉందని కేంద్రప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా విడుదల చేసిన ఆర్థిక సర్వేలో వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో నెలకు 3 వేల కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైన రాబడి.. సెప్టెంబర్ నుంచి అనూహ్యంగా పుంజుకున్నది. ఒక్క నవంబర్ నెలలోనే రూ.6,876 కోట్ల ఆదాయంతో ఆల్టైమ్ రికార్డుగా 77 శాతం వృద్ధిరేటు సాధించింది. డిసెంబర్లో రూ.5,812కోట్లు, జనవరిలో రూ.5,223 కోట్లు, ఫిబ్రవరిలో 5,095 రాబడి వచ్చింది. ఫిబ్రవరి నాటికి జీఎస్టీ, విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కలిపి మొత్తం రూ. 46,254 కోట్ల మార్క్ను దాటింది. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, కమిషనర్ నీతూకుమారి జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పన్ను బకాయిలను వందశాతం వసూలు చేయాలనే లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. బకాయిదారుల నుంచి పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా 400 బృందాలను రంగంలోకి దిం పారు. నోటీసులు జారీచేయడంతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కొన్నిచోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నారు.