చెన్నై: తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ఎస్పీ జననాథన్ కన్నుమూశారు. గత గురువారం అపస్మారక స్థితిలో తన ఇంట్లో పడివున్న జననాథన్ను కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. కాగా, జననాథన్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
డైరెక్టర్ జననాథన్ సర్ మృతివార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ కథానాయిక శృతిహాసన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయనతో పనిచేసినందుకు గర్వంగా ఉందని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆమె ట్వీట్ చేశారు. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో ప్రస్తుతం లాభం సినిమా నిర్మాణంలో ఉన్నది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి, శృతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్షిక, కలైయరసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.