ప్రత్యేక ప్రతినిధి, మార్చి11 (నమస్తేతెలంగాణ): గత ఏడాది కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి కూడా కుదేలైంది. కొన్ని రాష్ర్టాలు అతిత్వరగా కోలుకొని తిరిగి ప్రగతి బాటలో పురోగమిస్తుండగా, కేంద్రం సహా మరికొన్ని రాష్ర్టాలు ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మూడు నుంచి ఆరు శాతానికి పడిపోయింది.
పెద్ద రాష్ర్టాలలో తెలంగాణ, గుజరాత్ వంటి రాష్ర్టాలు కరోనా సంక్షోభాన్ని తట్టుకొని వృద్ధిరేటును సాధించాయని జాతీయ ఆర్థిక గణాంకాల కార్యాలయం ‘సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్’ నివేదికలో వెల్లడించింది. దేశ జీడీపీ మైనస్ (-4) నాలుగు శాతం తగ్గుదల నమోదు కాగా తెలంగాణ జీఎస్డీపీ 1.65% పెరిగిందని తెలిపింది. దేశంలోని చాలా రాష్ర్టాల జీఎస్డీపీ వృద్ధిరేటు తిరోగమనంలోనే ఉన్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం పేర్కొంది. ప్రస్తుత ధరల ప్రకారం గత ఏడాది రాష్ట్ర సంపద రూ.9,21,789 కోట్లు కాగా, అదనంగా రూ.77,210 కోట్లు పెరిగి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,98,999 కోట్లకు చేరింది.
తలసరి ఆదాయం పెరిగిన అతి కొద్ది రాష్ర్టాలలో తెలంగాణ కూడా నిలిచింది. ప్రస్తుత ధరల వద్ద గత ఏడాది రూ.2,25,756గా ఉన్న తలసరి ఆదాయం ఈ ఏడాదికి రూ.2,27,145కు పెరిగింది. కరోనా సంక్షోభం ఎదురైనప్పటికీ తలసరి ఆదాయం 0.61% వృద్ధిని నమోదు చేసింది. ఇక దేశ జీడీపీ గత ఏడాది రూ.203.51 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాదికి అది రూ.195.86 లక్షల కోట్లకు పడిపోయింది. జాతీయంగా తలసరి ఆదాయం కూడా 5 శాతం వరకు తగ్గిపోయింది. గత ఏడాది రూ.1,34,186గా ఉన్న సగటు తలసరి ఆదాయం, ఈ ఏడాది రూ.1,27,768కి తగ్గింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 2014లో రూ.4,08,282 కోట్లు ఉన్న రాష్ట్ర సంపద ఆరున్నరేండ్లలోనే వంద శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. మొదటినుంచి జాతీయ సగటు కంటే అధిక వృద్ధిరేటును నమోదు చేసుకుంటున్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంజిన్గా మారింది. ఇంత వేగంగా జీడీపీని పెంచుకున్న రాష్ట్రం మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రం ఏర్పడకముందు ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం రూ.95,361 మాత్రమే కాగా ఆరున్నరేండ్లలో రూ.2.27 లక్షలకు పెరిగింది.