న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సాధించిన విజయాలతో దేశం గర్విస్తున్నదని అన్నారు. మహిళా సాధికారత సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు. ‘మన దేశానికి చెందిన మహిళలు సాధించిన అనేక విజయాలతో భారత్ గర్విస్తున్నది. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ సాధికారత సాధించేలా మా ప్రభుత్వం కృషి చేస్తున్నది’ అని ట్వీట్ చేశారు.
మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో, అభివృద్ధిలో అతివలు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తామని నిరూపించుకున్నారని వెల్లడించారు. మహిళా సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. మహిళలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు పలు పథకాలు అమలుచేస్తున్నామని అన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉద్యోగినులకు ప్రత్యేక సాధారణ సెలవు దినంగా ప్రకటించారు.