హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలు ఐటీఐఆర్పై అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని.. దమ్ముంటే దానిని రద్దుచేసిన కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంపీ రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఐటీఐఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించిన విషయాలను తెలుసుకొని మాట్లాడాలని సూ చించారు. బుధవారం తెలంగాణభవన్లో ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, జీవన్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీఐఆర్పై 2008 లో నిర్ణయం జరిగిందని.. అప్పుడు కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం లేదు, తెలంగాణ ఏర్పడలేదని.. ఈ విషయం కూడా తెలియకుం డా మాట్లాడటం బండి సంజయ్ అవగాహనా రాహిత్యాన్ని బయటపెడుతున్నదని ఎద్దేవాచేశారు.
ఐటీఐఆర్ విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నామంటూ కేంద్రమంత్రి చెప్పినప్పుడు ఏమీ మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎన్నికలు ఉండటంతో ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించకపోవటం వల్లే హైదరాబాద్కు ఐటీఐఆర్ను ఇవ్వలేదని చెప్తున్నవారు.. బీజేపీ ప్రభుత్వ మే అధికారంలో ఉన్న బెంగళూరులో ఎం దుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ యువత జాబ్ సీకర్స్గా ఉం డటం కంటే స్టార్టప్లవైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఐటీమంత్రి కేటీఆర్ కృషివల్లనే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ను ఎంచుకున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను ఏనాడూ కేంద్రం వద్ద ప్రస్తావించని బీజేపీ నేతలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాట్లాడే నైతికహక్కు లేదని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్తో పెట్టుకున్నవాళ్లెవరైనా కాలగర్భంలో కలిసిపోతారని ఎ మ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు. విధానపరమైన లోపాలుంటే బాధ్యతాయుత పార్టీగా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని, కానీ .. కేసీఆర్పై వ్యక్తిగతం గా విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు సృష్టించటమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అలాంటి అపరిపక్వ, దుష్ప్రచారకర్తను తామింతవరకు చూడలేదని తెలిపారు. బీజేపీ నేతలది తాత్కాలిక పొంగేనని పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాదని, ఆయనో మెంటల్ సంజయ్ అని ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. 2008 నుంచి 2014 దాకా కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి ఐటీఐఆర్ తీసుకురాకుండా ఏమిచేశారని ప్రశ్నించారు. స్థాయి, హోదా ను మరిచి సీఎం కేసీఆర్పై ఏది పడితే అది మాట్లాడితే ప్రజలే వారి నాల్కలు కోస్తారని హెచ్చరించారు. బండి సంజయ్ను ఎర్రగడ్డ మెంటల్ దవాఖానలో చేర్పించి చికిత్స చేయిస్తే మంచిదని ఎద్దేవా చేశారు.
ఏ ముఖం పెట్టుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ములుగు జిల్లా పర్యటనకు వెళ్తారని టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇం చార్జి వై సతీశ్రెడ్డి మండిపడ్డారు.ఈ నెల 5న జిల్లాలో కాలు పెట్టకముందే గిరిజన వర్సిటీపై సమాధానం చెప్పాలని డిమాం డ్ చేశారు. ఈ మేరకు బుధవారం బహిరంగ లేఖరాశారు. విభజన చట్టంలో హామీ మేరకు ఏపీలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కేంద్రం.. తెలంగాణలో ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నించారు. బండి సంజయ్కు దమ్ముంటే కేంద్రంతో కొట్లాడి గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయిస్తానని గట్టమ్మ దేవతమీద ప్రమాణం చేశాకే ములుగు జిల్లాలో కాలుపెట్టాలని డిమాండ్ చేశారు.