నాడు శోకాన్ని చూసిన వాల్మీకి నోట శ్లోకం వచ్చింది.. అనంతమైన దుఃఖాన్ని చూసిన గౌతమబుద్ధుడిలో అపారమైన కరుణ వెల్లువెత్తింది. నేడు తెలంగాణలో పేదల దుఃఖం.. ప్రజానాయకుడు కేసీఆర్లో అంతులేని ఆవేదనను కారణమైంది. తన ప్రజల కాళ్లకింద మల్లెలు పరిచేందుకు పద్నాలుగేండ్లు పల్లేరుకాయలమీద నడిచాడు. అహరహం ప్రజల కష్టాలను కడతేర్చేలా ఆలోచన చేశాడు. ప్రతి ఘడియ.. ప్రజల కోసమే జీవిస్తున్న గొప్పవాడు.. అంతశ్చైతన్యం కలిగిన దార్శనికుడు. అనేక సంక్షేమ పథకాల రూపశిల్పి.. కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఆరున్నరేండ్లలో దాదాపు ఐదు వందల పథకాలను ప్రవేశపెట్టి.. బడుగుల బంధువైనాడు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ పథకాలు చేరని గడప లేదు. కొనియాడని ఇల్లులేదు. ఒకరికి పెద్ద కొడుకైతే.. మరొకరికి మేనమామ, ఇంకొకరికి అన్నయ్య. పేదల కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చిన నాయకుడి గురించి లబ్ధిదారుల హృదయ స్పందనలు ఇవి.
కల్పనే కల్యాణం
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మలి ఉద్యమం తొలినాళ్లు.. నాటి వరంగల్ జిల్లా ములుగు మండలం కొడిశలకుంట పంచాయతీ శివారు భాగ్యతండా.. అందరూ దుర్గమ్మ పండుగకు వెళ్లారు. బానోతు కీమానాయక్, రుక్కలమ్మ ముగ్గురు కూతుళ్లు కల్పన, సునీత, కవిత ఇంట్లోనే ఉన్నారు. ముగ్గురూ నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో ఇంటిమూల సూరంటుకున్నది. మంటలుచూసి అదిరిపోయిన అక్కాచెల్లెళ్లు అరుస్తూ పరుగులు పెట్టారు. కండ్లముందే వాళ్ల ఇంటితోపాటు తండాలోని 40 ఇండ్లూ కాలిపోయాయి. బిడ్డ కల్పన పెండ్లి చేయాలని కీమానాయక్ ఇంట్లో పెట్టిన రూ.50 వేల నగదు, పెండ్లి వస్తువులు బుగ్గిపాలయ్యాయి. ఆ సమయంలో వరంగల్లోఉన్న ఉద్యమనేత కేసీఆర్ విషయం తెలిసి.. హుటాహుటిన భాగ్యతండాకు చేరుకున్నారు. కాలిబూడిదైన ఇండ్లను పరిశీలిస్తున్న క్రమంలో కీమానాయక్ తన ముగ్గురు ఆడపిల్లలతో సహా కేసీఆర్ కాళ్లపై పడిపోయాడు. బిడ్డపెండ్లికి తెచ్చుకున్న సొమ్ము.. కొనుక్కొచ్చిన కొత్తబట్టలు అన్నీ కాలిపోయాయని, ఇక నా బిడ్డ పెండ్లి ఎట్లా.. దాని జీవితమెట్లా? అంటూ కన్నీళ ్లపర్యంతమయ్యాడు. అతడ్ని ఓదార్చిన కేసీఆర్.. ‘బిడ్డపెండ్లి నేనే దగ్గరుండి చేస్తా.. పైసలు నేను ఇస్తా.. ఫికర్ చేయకు’ అంటూ ధైర్యం చెప్పారు.
మాట ఇచ్చినట్టుగానే కేసీఆర్ శ్రీరామనవమి తర్వాత పసుపు, కుంకుమ, కట్నకానుకలు అందించి దగ్గరుండి కల్పన పెండ్లి జరిపించారు. ఆడబిడ్డ పెండ్లికి పేదింటి తల్లిదండ్రులు పడుతున్న కష్టం ఉద్యమనేత హృదయాన్ని ద్రవింపజేసింది. స్వరాష్ట్రంలో అలా ఎవరూ ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ ఆవిర్భవించిన మరుసటి సంవత్సరమే కల్యాణలక్ష్మికి శ్రీకారం చుట్టారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కులమతాలతో సంబంధం లేకుండా రూ.1,01,116 అందజేస్తున్నారు.
ఆగిపోద్ది అనుకున్న మా పెండ్లిని దగ్గరుండి చేసిండు సారూ అంటూ కల్పన ఇప్పటికీ సీఎం కేసీఆర్కు చేతులు జోడించి దండం పెడుతున్నారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో ఉంటున్న నూనావత్ కల్పన, యాకూ దంపతులు. మా జీవితాన్ని నిలబెట్టిన సారు మాకెప్పుడూ మదిల్నె ఉంటరు. రోజూ తలచుకుంటం.. పిలుచుకుంటం అని పేర్కొంటున్నారు. తన ఇద్దరు పిల్లలకు కేసీఆర్ పేరు వచ్చేలా కొడుకుకు చంద్ర హుస్సేన్, బిడ్డకు చంద్రకళ అని పెట్టుకున్నామని కృతజ్ఞతాభావంతో చెప్తున్నారు. చంద్రకళ హన్మకొండలో ఇంటర్ ఫస్టియర్, చంద్రహుస్సేన్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు.