అందోల్, జూలై 15: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అందోల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అందోల్ చెరువుతో పాటు అన్నాసాగర్ చెరువులోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో చెరువులకింద పంటలను సాగుచేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షకాలం ప్రారంభం నుంచి అడపా..దడపా కురిసిన వర్షాలకు చెరువులోకి కొద్దిగా నీళ్లు రాగా… వారం రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అందోల్ మండలంతో పాటు పుల్కల్, రాయికోడ్, చౌటకూర్, వట్పల్లి, మునిపల్లి, నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలాల్లో చెరువులు కుంటలోకి పుష్కలంగా నీరు చేరింది.
నిండుకుండలా నారింజ ప్రాజెక్టు
జహీరాబాద్, జూలై 15 : నారింజ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి గేట్లుకు మరమ్మతులు, పూడిక తీయడంతో వరద నీటితో కళకళలాడుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వానకు నారింజ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు చొరవతో నారింజ ప్రాజెక్టుకు మరమ్మతులు చేశారు. ప్రాజెక్టులోనీటి నిల్వలు, భూగర్భ జలాలు పెరిగింది. ఈ ఏడాది భారీగా వానలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద చేరుతుండడంతో ప్రాజెక్టుకు జలకళను సంతరించుకుంటుంది. ప్రాజెక్టులో 58 ఎంసీఎఫ్టీ నిల్వ ఉంది. ప్రాజె క్టు నుంచి 80 ఇంచుల వరద నీరు దిగువకు వెళ్తుంది.
చెరువుల్లో భారీగా వరద నీరు
ఝరాసంగం,జూలై 15: ఝరాసంగంతో పాటు జీర్లపల్లి, మేదపల్లి, సిద్దాపూర్, ఏడాకులపల్లి,దేవరంపల్లి తదితర గ్రామాల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువుల్లో భారీ వరద నీరు వచ్చి చేరింది. జీర్లపల్లి చెరువులోకి భారీగా వరద నీరు రావడంతో మత్తడి పొంగిపొర్లింది.
భారీ వర్షంతో ఇండ్లలో నీరు
చౌటకూర్, జూలై 15 : భారీ వర్షానికి పలు గ్రామాల్లో ఇండ్ల లోకి నీళ్లు చేరాయి. తాడ్దాన్పల్లి గ్రామంలో ఇండ్లలోకి నీళ్లు రావడంతో రాత్రంతా జాగారం చేశారు. మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు.