సింగూరులోకి కొనసాగుతున్న వరద
పొంగిపొర్లుతున్న నల్లవాగు, నారింజ ప్రాజెక్టు
మత్తడి దుంకుతున్న చెరువులు, కుంటలు
సంగారెడ్డి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుతున్నాయి. నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. సింగూరు ప్రాజెక్టు నీటిమట్టం 18.348 టీఎంసీలకు చేరుకుంది. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. పత్తి, ఇతర పంటల సాగుకు ఇంకా అవకాశం ఉండడంతో విత్తనాలు విత్తుకుంటున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 7 లక్షలు దాటే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 42.63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 15.27 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. గురువారం జిల్లావ్యాప్తంగా సరాసరి 5.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గుమ్మడిదలలో అత్యధికంగా 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
పొంగిపొర్లుతున్న నారింజ వాగు..
సంగారెడ్డి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటిమట్టం 18.348 టీఎంసీలకు చేరుకుంది. నల్లవాగు ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 0.746 టీఎంసీ కాగా, ప్రస్తుతం 0.746 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. జహీరాబాద్లోని నారింజ ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 58 ఎంసీఎఫ్టీ కాగా, పూర్తిగా నిండింది. దీంతో ప్రాజెక్టు గేట్లపై నుంచి నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. నారింజ ప్రాజెక్టులో నుంచి వరద దిగువన కర్ణాటకలోని కరంజా ప్రాజెక్టులోకి వెళ్తున్నాయి. నారింజ ప్రాజెక్టు నిండటంతో జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లో 4 వేల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. సదాశివపేట మండలంలోని గంగకత్వ వాగు పారుతున్నది. జిల్లాలో మొత్తం 3140 చెరువులు ఉండగా, 27 చెరువులు అలుగు పారుతున్నాయి. 130 చెరువుల పూర్తిగా నిండాయి. 402 చెరువుల్లోకి 75 శాతం నీరు రాగా, 1331 చెరువుల్లోకి 50 శాతం మేర నీరు వచ్చింది. వర్షాలు ఇలాగే కొనసాగితే త్వరలోనే జిల్లాలోని చెరువులన్నీ నిండి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. న్యాల్కల్ మండలంలోని హద్నూర్ , చినిగేపల్లి ప్రాజెక్టు, డప్పూర్ చెరువులో వరద చేరుతున్నది. ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి, మేదపల్లి, గంగాపూర్ చెరువులో వరద చేరుతున్నది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తున్నది. నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్, ర్యాకల్, తుర్కపల్లి, మనూరు మండలంలోని గట్టులింగంపల్లి, కమలాపూర్ చెరువులు అలుగు పారుతున్నాయి. అందోల్ నియోజకవర్గంలో అన్నసాగర్ చెరువు నిండుతున్నది. వట్పల్లి, రాయికోడ్, మునిపల్లి, పుల్కల్, చౌటకూరు మండలాల్లో పలు చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి.
వర్షాలతో పంటలకు ప్రాణం..
వర్షాలతో పంట పొలాలకు ప్రాణం పోసినట్లయ్యింది. విత్తనాలు వర్షాలకు మొలకెత్తడంతోపాటు ఎదగడానికి దోహదం చేయనున్నాయి. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, కంది తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. నల్లరేగడి భూముల్లో ఎక్కడైనా వర్షం నీళ్లు నిలిచిన పక్షంలో రైతులు కాల్వలు కట్టుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.