సంగారెడ్డి, సెప్టెంబర్ 27 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు అలుపెరుగని పోరాటం చేసిన మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం ప్రజా సేవకు అంకితం చేశారని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం(ఫలపరిశోధన కేంద్రం)లో ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని కలెక్టర్ హనుమంతరావుతో కలిసి జడ్పీ చైర్పర్సన్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్లో ఆచార్య బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవ వేడుకలను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంజుశ్రీ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కొండా లక్ష్మణ్ గొంతెత్తి పేదల పక్షాన నిలిచారన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పోరాటం చేసిన సమరయోధుడు బాపూజీ అని కొనియాడారు. బాపూజీ పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకం కావాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
తొలి దశ ఉద్యమంలో ప్రధాన పాత్ర..
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ ప్రధాన పాత్ర పోషించి ఆదిగురువుగా ప్రజలకు అండగా నిలిచారని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదివిని త్యజించి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహావ్యక్తి బాపూజీ అని కొనియాడారు. ఆయన తుదిశ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు, బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి కేశురాం, జడ్పీ సీఈవో ఎల్లయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ రాజ్కుమార్, కౌన్సిలర్లు వీణ, శ్రీకాంత్(నాని), కుల సంఘాల ప్రతినిధులు మహేశ్, రమేశ్చౌహాన్, నామ నగేశ్, జనార్దన్, రాములు, మల్లేశం, సత్యం, గోలి యాదగిరి, సోమశేఖర్, రాములు నేత, సిద్ధేశ్వర్, చంద్రశేఖర్, బూర మల్లేశం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.