సంగారెడ్డి, జూలై 27 : విద్యార్థి దశలో ర్యాగింగ్ చేస్తే శిక్ష తప్పదని, అందుకు ప్రోత్సహించినా, సహకరించినా శిక్షార్హులేనని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో ర్యాగింగ్ నిషేధ చట్టంపై అవగాహన సదస్సును జిల్లా న్యాయపేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఆశాలత ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల విద్యార్థులతో వర్చువల్ పద్ధతిన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పాపిరెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్ చేయడంతో విద్యార్థుల భవిష్యత్ పాడవుతుందని, అంతేగాక మానసికం, భౌతికంగా కుంగిపోతారని, ర్యాగింగ్ చేయడం తప్పు అని అన్నారు. విద్యార్థులందరూ ర్యాగింగ్ అనే భూతానికి దూరంగా ఉండాలన్నారు. ర్యాగింగ్ కార్యకలాపాలను కళాశాలల్లో ప్రోత్సహించొద్దని, దానికి శిక్షార్హులు కావొద్దని సూచించారు. ఈ సదస్సులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ జలీల్, మహిళా, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి పద్మావతి, ఎంఎన్ఆర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.