కంది, అక్టోబర్ 25 : యాసంగిలో వరి సాగు కన్నా ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు మేలు చేకూరుతుందని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం కంది క్లస్టర్ రైతు వేదికలో యాసంగి సీజన్ 2021-22కు సంబంధించిన సంగారెడ్డి, పటాన్చెరు వ్యవసాయశాఖ ఏడీలు, ఏఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) వరిని కొనడం లేదని, ఈ విషయం రైతులకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు. రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించి వారికి లాభం చేకూరేలా వ్యవసాయాధికారులు పూర్తి బాధ్య త వహించాలన్నారు. రైతులు యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, కంది, మినులు తదితర ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఈనెల 27 నుంచి 29 వరకు రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డీలర్లు యాసింగిలో వరి ధాన్యం విత్తనాలు అమ్మితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి షాప్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, కంది సర్పంచ్ విమల, సీడ్స్ కార్పొరేషన్ ప్రతినిధి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.