సంగారెడ్డి, జనవరి 23 : దళితుల అభ్యున్నతి, వారి ఆర్థికాభివృద్ధికి ఉద్దేశించి అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని పార్టీలకు అతీతంగా అమలు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సూచించారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లోని చాంబర్లో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, మాణిక్యరావు, కాంత్రికిరణ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 5లోగా దలితబంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఒకటి, రెండు గ్రామాలను ఎంపిక చేసుకుని లబ్ధ్దిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా చేపట్టాలని సూచించారు. మార్చి మొదటి వారంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, లబ్ధ్దిదారుల ఎంపిక నుంచి పంపిణీ వరకు ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పనిచేయాలన్నారు.
ప్రతి దళితుడి ఇంటిలో ఒకరికి పథకం అందేలా చర్యలు తీసుకోవాలని, ముందుగా ఎంపిక చేసిన గ్రామాల్లో పథకం అమలు చేసి, వచ్చే ఏడాది బడ్జెట్ నుంచి అందరికీ అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మొదటి దశలో నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకం అమలు చేయాలని, స్థానిక ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా పాల్గొనాలని మంత్రి స్పష్టం చేశారు. రెండు నెలల్లోగా లబ్ధిదారులకు దళితబంధు అందించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలు, లబ్ధిదారులను ఎంపిక చేయడం, వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించడం, లబ్ధిదారులు కోరుకున్న యూనిట్కు సంబంధించి శిక్షణనివ్వడం, పంపిణీ పూర్తిచేసి యూనిట్లు అందించడం వంటి పనులన్నీ ప్రణాళికా ప్రకారం పూర్తి చేయాలన్నారు. లబ్ధ్దిదారునికి ఎలాంటి అప్పు లేకుండా దళితబంధు పథకంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 లక్షలను గ్రాంటుగా ఇస్తుందని మంత్రి తెలిపారు. దళితబంధు పథకం లబ్ధిదారులకు రూ.10లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తామని, ఇందులో నుంచి రూ.10 వేలు లబ్ధ్దిదారులకు రక్షణ నిధిగా ఉంటుందన్నారు. లబ్ధ్దిదారుడి పదివేలతో పాటు ప్రభుత్వం మరో పదివేలు కలిపి దలిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుందని, ఏదేని కారణంతో ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నా, అనారోగ్యం పాలైనా కాపాడడానికి ఆ నిధి ఉపయోగిస్తారన్నారు.
ఏ జిల్లాకు ఆ జిల్లాలో దళిత నిధిని ఏర్పాటు చేస్తారని మంత్రి హరీశ్రావు తెలిపారు. లబ్ధ్దిదారులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో అర్హులైన దళిత కుటుంబాలందరికీ దళితబంధు పథకం అమలు చేస్తామన్నారు. మార్చి 7వ తేదీలోగా లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. ఎమ్మెల్యేలు గ్రామాలను ఎంపిక చేసిన తర్వాత అధికారులు వెళ్లి లబ్ధ్దిదారులను ఎంపిక చేస్తారని, దళితబంధు పేరిట కొత్తగా వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.లబ్ధ్దిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారలు ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. లబ్ధ్దిదారులు కోరుకున్న రంగంలో యూనిట్ను అందించాలన్నారు. సంబంధిత యూనిట్ను జిల్లాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చని, లబ్ధ్దిదారులందరూ ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాల్లో తమకు నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకోవచ్చన్నారు.
రూ.10లక్షలతో ఒక యూనిట్ కాకుండా ఒకటికి మించి ఎన్ని యూనిైట్లెనా పెట్టుకోవచ్చన్నారు. పాడి పరిశ్రమ అయితే లాభదాయకంగా ఉంటుందని, గేదెలకు వందశాతం ఇన్సూరెన్స్ ఉంటుందన్నారు. లబ్ధ్దిదారులు సరైన నిర్ణయం తీసుకునేలా ఎమ్మెల్యేలు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఎరువులు, మందుల దుకాణాలు, బార్షాప్, మినీ డెయిరీ యూనిట్, టైలరింగ్, ట్రాన్స్పోర్టు, ట్రాక్టర్, ట్రాలీ, కోడిపిల్లల పెంపకం, వరినాటు యం త్రాలు, పవర్ టిల్లర్, పందిరి కూరగాయల సాగు, ఐరన్ గేట్స్, గ్రిల్స్ తయారీ యూనిట్, సిమెంట్ ఇటుకలు, రింగుల తయారీ, కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రాలు, వ్యాపారం, ఆయిల్ మిల్, పిండి, పసుపు, కారం, మిల్లులు, మినీ సూపర్ బజార్, రిటైల్ దుకాణాలు, హార్వేస్టర్, శానిటరీ దుకాణం, విద్యుత్ పరికరాల అమ్మకం, హోటల్, క్యాటరింగ్ సర్వీస్, టెంట్హౌస్, డెకరేషన్, లైటింగ్ తదితర పథకాలు లబ్ధ్దిదారుల ఇష్టప్రకారం ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే ఇస్తారని, కలెక్టర్ వద్దకు దళితబంధుకు సంబంధించిన నిధులు వచ్చాయని, వచ్చే మూడు, నాలుగు రోజుల్లోగా గ్రామాల జాబితా ఇవ్వాలని ఎమ్మెల్యేలను మంత్రి హరీశ్రావు కోరారు.
దళితబంధు పథకం ప్రక్రియను వేగవంతం చేసి, లబ్ధ్దిదారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అందుకు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు చిట్టి దేవేందర్రెడ్డి, శివకుమార్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నరసింహారావు, డీఆర్డీవో శ్రీనివాస్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, ఉద్యానవనశాఖ అధికారి సునీత, ఎల్డీఎం రమణారెడ్డి, పరిశ్రమలు, మత్స్య, పశుసంవర్ధకశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
‘మన ఊరు-మన బడి’కి రూ.7,280 కోట్లు…
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,280 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇందుకోసం క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ప్రతిష్టాత్మకంగా అమలు చేసే ‘మన ఊరు-మన బడి’ని విజయవతం చేయాలని కోరారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రానున్న రెండేండ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి స్పష్టంచేశారు. మొదటి సంవత్సరం మండల కేంద్రాన్ని యూనిట్గా తీసుకుని అత్యధికంగా విద్యార్థులు ఉన్న(ఉన్నత, మాధ్యమిక, ప్రాథమిక) పాఠశాలలను తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు.ప్రభుత్వం స్థానిక సంస్థలకు చెందిన 35 శాతం పాఠశాలలను తీసుకుని నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలలకు మాడ్రన్ పెయింటింగ్ వేయడం, మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్స్, లైట్స్ ఏర్పాటు, ప్రహరీలు, డైనింగ్హాల్, శిథిలమైన వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం, అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్స్ తదితర పనులు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపు జరిగిందని, త్వరలో మం జూరు వస్తున్నదని, జిల్లాకు సంబంధించి వేగవంతంగా ప్రణాళికలు చేసుకోవాలని ఎమ్మెల్యేలు, డీఈవోలకు మంత్రి హరీశ్రావు సూచించారు. మొదటి విడత ఎక్కువ మంది పిల్లలు చదువుతున్న 35శాతం పాఠశాలలకు ప్రతిపాదనలు పంపాలన్నారు.