సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నదని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షీ షా పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరయ్యారు. అంతకుముందు విద్యార్థులు, యువత స్థానిక ప్రభుత్వ ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షీ మాట్లాడుతూ జిల్లాలోని సింగూర్, మంజీర ప్రాజెక్టులు, ఝరాసంఘం కేతకీ సంగమేశ్వరాలయం, బొంతపల్లి వీరభద్ర స్వామి, రేజింతల్ సిద్ధి వినాయక దేవాలయాలు ఇప్పటికే పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లా వాసులే కాకుండా పక్క రాష్ర్టాల పర్యాటకులు సందర్శిస్తున్నారని తెలిపారు. అనంతరం పర్యాటక రంగం ఆవశ్యకతపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన 24 మంది విద్యార్థులకు డీఆర్వోతో కలిసి బహుమతులను అందజేశారు. కార్యక్రమం లో జిల్లా రెవెన్యూ అధికారి రాధికారమణి, జిల్లా యువజన సంక్షేమ అధికారి జావేద్ అలీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద రామ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజే శ్, జిల్లా సైన్స్ అధికారి విజయ్కుమార్, ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.