సంగారెడ్డి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ దార్శనికత, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చొరవ ఫలితంగా సంగారెడ్డి జిల్లాకు పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభు త్వ చొరవతో జహీరాబాద్ ప్రాంతం మెగా పరిశ్రమల ఏర్పాటుకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నది. ఇక్కడ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చర్ జోన్(నిమ్జ్)లో భారీ పరిశ్రమలను ఏర్పాటుకు పారిశ్రామిక సంస్థలు ముందుకు వస్తున్నాయి. తద్వారా స్థానికులకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. జహీరాబాద్లోని నిమ్జ్లో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో ట్రైటాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులు వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాగా, ఆదివారం రాష్ట్ర ప్రభుత్వంతో వెమ్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. రక్షణ రంగం, స్పేస్ టెక్నాలజీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సిస్టమ్స్కు సంబంధించిన రంగాల్లో పనిచేస్తున్న వెమ్ టెక్నాలజీ ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలోని నిమ్జ్లో సమీకృత రక్షణ ఉత్పత్తులు పరిశ్రమ (ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ) రూ.1000 కోట్ల పెట్టుబడితో 511 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నది. ఇందులో రక్షణ రంగానికి మానవ రహిత యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, నౌకాదళ యంత్రాలను, రాడార్లను తయారు చేయనున్నట్లు తెలుస్తుంది.
ఈ పరిశ్రమ ఏర్పాటుతో 2వేల మందికి ఉపాధి లభించనున్నది. స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వెమ్ టెక్నాలజీస్ ఎల్గోయిలో నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయనున్నది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా స్థానిక యువతకు శిక్షణ అందజేసి పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తారు. నిమ్జ్లో రక్షణ రంగానికి సంబంధించిన మరిన్ని పరిశ్రమలు ఏర్పాటుకు తెరలేవనున్నది. సంగారెడ్డి జిల్లాలో రక్షణ రంగానికి సంబంధించిన రెండు ముఖ్యమైన పరిశ్రమలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ప్రతిష్ఠాత్మకమైన డిఫెన్స్ రంగానికి చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(ఓడీఎఫ్) ఉంది. ఇందులో ట్యాంకులు, ఇతర రక్షణ రంగానికి సంబంధించి పరికరాలను తయారు చేస్తారు. పటాన్చెరు మండలం భానూర్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఇందులో క్షిపణులు, క్షిపణి గైడింగ్ వ్యవస్థలను తయారు చేస్తారు. తాజాగా డిఫెన్స్ రంగానికి సంబంధించి వెమ్ టెక్నాలజీస్ ఝరాసంగం మండలం ఎల్గోయిలోని నిమ్జ్లో 511 ఎకరాల్లో సమీకృత రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయనున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెమ్ టెక్నాలజీస్ ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ సిస్టమ్ పరిశ్రమకు మెగా ప్రాజెక్టు హోదా ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
రూ.2,100 కోట్లతో ట్రైటాన్ పరిశ్రమ
జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్లో రూ.2100 కోట్లతో ట్రైటాన్ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ పరిశ్రమ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 6న ట్రైటాన్ సంస్థ ప్రతినిధులు ఝరాసంగం మండలం ఎల్గోయి, బర్ధీపూర్ శివారులోని నిమ్జ్ భూములను పరిశీలించారు. ట్రైటాన్ సంస్థ 200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా రెండువేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మంచి పేరున్న ట్రైటాన్ సంస్థ నిమ్జ్లో రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను ఏర్పాటు చేయనుండడంపై స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జహీరాబాద్ నిమ్జ్లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశమున్నది. చాలా మంది పారిశ్రామిక వేత్తలు, సంస్థలు నిమ్జ్లో మెగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్జ్ ఏర్పాటు కోసం 12,500 ఎకరాలను సేకరించనున్నారు. ఇప్పటి వరకు పరిశ్రమల ఏర్పాటు కోసం టీఎస్ఐఐసీ నిమ్జ్ కోసం 3500 ఎకరాలు సేకరించి త్వరలోనే మిగతా భూములను సేకరించనున్నది. నిమ్జ్ ఏర్పాటుతో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందనున్నది. నిమ్జ్ ఏర్పాటుతో ఇదివరకే జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. తాజాగా నిమ్జ్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతుండటంతో జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని భూముల ధరలు మరింత పెరుగనున్నాయి.
పరిశ్రమలకు అడ్డాగా జహీరాబాద్..
సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో పారిశ్రామిక వాడలు, పరిశ్రమలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ సుదీర్ఘదృష్టి, చొరవ ఫలితంగా పటాన్చెరు నియోజకవర్గానికి పోటీగా జహీరాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం భారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. నిమ్జ్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు అవుతుండటంతో స్థానిక ప్రజలు, యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జహీరాబాద్ ప్రాంతంలో ఇది వరకే ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్ర రెండు పరిశ్రమలను ఏర్పాటు చేసింది. దీనిద్వారా స్థానికులు ఉద్యోగులు, ఉపాధి పొందుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు రసాయనిక పరిశ్రమలున్నాయి. జహీరాబాద్ మండలం గోవిదాందాపూర్లో హాట్సన్ సంస్థ భారీ డెయిరీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. నిమ్జ్లో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో ట్రైటాన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తుండగా, తాజాగా వెమ్ టెక్నాలజీస్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో డిఫెన్స్ సిస్టమ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నది. నిమ్జ్లో త్వరలో మరిన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉంది. నిమ్జ్లో పరిశ్రమల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభు త్వం, ముఖ్యంగా ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా చొరవ కనబరుస్తున్నారు.