జహీరాబాద్, మే 7 : 65వ జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో కర్ణాటక, మహారాష్ట్ర బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో లాక్డౌన్ లేకపోవడంతో సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రకు అక్రమంగా ఆక్సిజన్, ఇతర మందులు రవాణా కాకుండా పోలీసులు చెక్పోస్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. జహీరాబాద్ మండలం చెరాగ్పల్లి శివారులో పోలీసులు చెక్పోస్టు ఏర్పాటు చేసి రాత్రి, పగలు వాహనాలను తనిఖీ చేయడంతో పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జహీరాబాద్-బీదర్ రోడ్డుపై సరిహద్దుల్లో ఉన్న గణేశ్పూర్ శివారులో పోలీసులు చెక్పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, సీఐ రాజశేఖర్, చెరాగ్పల్లి ఎస్సై కాశీనాథ్, హద్నూర్ ఎస్సై విజయ్రాజు చెక్పోస్టుల వద్ద పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర వాహనలకు తప్ప అనుమతి లేని వాహనాలు కర్ణాటక వైపు నుంచి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్, న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.