సంగారెడ్డి, జూలై 27: పేదవారు ఆకలితో అలమటించకుండా ఆహార భద్రత కార్డులు కలిగి ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు అందజేస్తుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్హాల్లో కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన అర్హులైన లబ్ధిదారులకు రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు మూడు పూటలా అన్నం తినేలా ప్రభుత్వం రేషన్కార్డుపై ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తున్నదన్నారు. అందుకోసం సీం కేసీఆర్ కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు. అనంతరం నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట్, కొండాపూర్, కంది మండలాలకు చెందిన 396 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 1383 మందికి కొత్త రేషన్కార్డులు అందజేశారు.
పుష్కలంగా సాగునీరు…
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, అందులో భాగంగానే ఇటీవల సాగునీరు అందజేసేందుకు ఎత్తిపోతల నిర్మాణాలకు సర్వే పనులకు శ్రీకారం చుట్టిందని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో పొలాలన్నీ పచ్చగా చేయడానికి సంగమేశ్వర, బసవేశ్వర లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు శంకుస్థాపన చేసి త్వరలో రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరుస్తారన్నారు. అలాగే, దళితులు ఆర్థికంగా అన్ని రంగాల్లో ఎదుగాలని సీఎం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఎంపీ తెలిపారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదవారికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందజేస్తున్నదని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యకర్మంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, పౌరసరఫరాలశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, రెవెన్యూ డివిజనల్ అధికారి మెంచు నగేశ్, తహస్దీలార్ స్వామి, గిర్దావర్లు నవీన నాగర్జునరెడ్డి, లబ్ధిదారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.