సంగారెడ్డి మున్సిపాలిటీ, జూన్ 17: కరోనా సమయంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యామూర్తి పాపిరెడ్డి అన్నారు. అయ్యప్ప ఆపద్బాంధవ సేవా సమితి ప్రారంభించి నెల రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం స్థానిక సాహితీ దవాఖాన వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా జడ్జి పాపిరెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప భక్తులు ఆధ్యాత్మికంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అదనపు కలెక్టర్ రాజర్షీ షా మాట్లాడుతూ నెల రోజులుగా అయ్యప్ప భక్తులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా బాగుందన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్ కార్యదర్శి ఆశాలత మాట్లాడుతూ ఇలాంటి సమయంలో రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం స్ఫూర్తిదాయకం అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వనజారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమన్నారు. కాగా, శిబిరంలో 32 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీ, సీఐ రమేశ్, సేవా సమితి అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సాహితీ రాము, కోశాధికారి మాణిక్యరెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, సంయుక్త కార్యదర్శి విశ్వనాథరావు, శబరిమల అయ్యప్ప సేవా సమాజం జిల్లా అధ్యక్షుడు సుధాకర్గౌడ్, సదాశివపేట గురుస్వాములు గోనె శంకర్, గణేశ్, సభ్యులు నరేష్కుమార్, పాండువర్మ, కారం రాధాకృష్ణ, సంగన్న, కన్నయ్య, దుర్గాగౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.