అందోల్, జూలై 26 : అందోల్-జోగిపేట ప్రధాన రహదారి నిర్మాణం కోసం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ చేసిన కృషి ఫలించింది. గతేడాది కురిసిన వర్షాలకు పట్టణంలో రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు ఎంపీ బీబీపాటిల్తో కలిసి ఢిల్లీకి వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా కృషిచేశారు. శనివారం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జోగిపేటలో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యేలు పనులు వెంటనే ప్రారంభించి రోడ్డును వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ ఆదివారం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడంతో స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అందోల్- జోగిపేట నుంచి సంగుపేట వరకు రూ. 12 కోట్ల వ్యయంతో 12 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఏడాది కాలంగా గుంతల రోడ్డుతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని తమ ఇబ్బందులు గుర్తించి రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్లు దుర్గేశ్, చందర్నాయక్, వెంకటేశం, టీఆర్ఎస్ నాయకులు ఆదివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఎంతోగానో కృషిచేశారని వారు కొనియాడారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఆలస్యం : ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
ఇది నాందేడ్ జాతీయ రహదారి. ఈ రోడ్డు పూర్తిగా పాడై కొన్నేండ్లు అవుతున్నది. ఈ రోడ్డును గత పాలకులు ముందే రిపేర్ చేసినా, ఇంత అధ్వానంగా ఉండేదికాదు. అప్పటి పాలకులు దీనిపై సరైన దృష్టి పెట్టకపోగా, తూతూ మంత్రంగా నాసిరకంగా రిపేర్లు చేశారు. దీంతో పట్టణంలో రోడ్డు పూర్తిగా పాడై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలి ప్రాధాన్యతగా రోడ్డు సమస్యను గుర్తించాను. కానీ ఈ రోడ్డు రాష్ట్ర పరిధిలోకి రాకపోవడంతో కొద్దిగా ఆలస్యమైంది. మంత్రి హరీశ్రావుకు సమస్యను వివరించాను. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి ఎంపీ బీబీ పాటిల్ను ఢిల్లీకి పంపించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఇందుకు సహకరించిన మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్కు ప్రత్యేక ధన్యవాదాలు.