జహీరాబాద్, జూలై 25 : అన్నదాతలు పాత కాలం వ్యవసాయాన్ని మానుకొని నూతన పద్ధతులతో పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వానకాలంలో ఒకే పంట సాగు చేయడంతో భారీ వర్షాలు కురిసి పంటలకు నష్టం వాటిల్లి అన్నదాత తీవ్రంగా నష్టాలకు గురికావల్సి వస్తోంది. వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నాసిరకం విత్తనాలు, రోజురోజుకూ పెరిగే పురుగు మందుల ధరలతో రైతులు ఇబ్బందులు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో రైతులు పంటలు సాగు చేసేందుకు రైతుబంధు పథకంలో పెట్టుబడికి డబ్బులు ఇస్తుండడంతో అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేస్తున్నారు.
పంటల సాగులో మార్పులు
వాన కాలంలో రైతులు ఒకటి కంటే ఎక్కువ పంటలు (అంతర) వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతర పంటల సాగుతో ఒక పంటకు నష్టం జరిగినా, మరో పంటను సాగు చేసుకునే అవకాశం ఉన్నది. అంతర పంటల సాగుతో లాభాలు పొందవచ్చని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లో రైతులు ఎక్కువగా పత్తి, సోయా, కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. వానకాలంలో సాగు చేసే పంటలు 90 నుంచి 110 రోజులు ఉండగా, మరి కొన్ని పంటలు 180 రోజులుగా ఉంటుంది.
తెగుళ్ల బారిన పడినా నష్టం ఉండదు..
వానకాలంలో ప్రకృతిలో మార్పులు వచ్చినా భారీ వానలు కురిసినా, కీటకాలు, తెగుళ్లు సోకి నష్టం జరిగినా, మరో పంట సాగు చేసుకునే అవకాశం ఉంది. అంతర పంట సాగుతో ప్రధాన పంట దక్కుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పెసర, మినులు, పంటల సాగుతో పొలానికి సత్తువ పెరుగుతోంది. అంతర పంటలతో భూమిలో పోషకాలు పెరిగే ఆవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అంతర పంటతోపెట్టుబడి ఖర్చులు తక్కువ
అంతర పంటలు సాగు చేయడంతో పెట్టుబడి ఖర్చులు తక్కువగా ఉంటాయి. కొందరు రైతులు ప్రధాన పంటల పక్కనే స్వల్ప విస్తీర్ణంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. ఒకటి రెండు నెలల్లో చేతికొస్తున్న కూరగాయల అమ్మకాలతో వస్తున్న ఆదాయాన్ని ప్రధాన పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు వినియోగిస్తున్నారు.
పంటల దిగుబడులు పెరిగే అవకాశాలు..
అంతర పంటల సాగుతో పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. అధిక దిగుబడులతో ఆహార ధాన్యాల కొరత తగ్గుతుంది. జహీరాబాద్ డివిజన్లో రైతులు వానకాలంలో 67 వేలకుపై ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 40 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అంతర పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తున్నది.
అంతర పంటలతో నష్టం భయం ఉండదు..
రైతుకు ఉన్న వ్యవసాయ భూమిలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేస్తే రైతులకు నష్ట భయం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా రైతులకు ఉన్న భూమి మొత్తం వినియోగంలోకి వస్త్తోంది. అంతర పంటల ద్వారా అధికంగా లాభాలు పొందవచ్చు. భూమిలో సత్తువ పెరిగి పంట దిగుబడి పెరిగే అవకాశమున్నది. రైతులకు చిరుధాన్యాల పంటలు సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ గ్రామాల్లో అవగాహన కల్పించింది.
-భిక్షపతి, ఏడీఏ జహీరాబాద్
కలిపి పంటలతో లాభం
మాకు ఉన్న భూమిలో కలిపి పంటలు సాగు చేయడంతో ప్రతి రోజూ పరిశీలించి, పనులు చేసుకుంటున్నాం. అంతర పంటలు సాగు చేయడంతో ఆహార ధాన్యాల కొరత ఉండదు. పంటలకు అవసరమైన సమయంలో రసాయనాలను పిచికారీ చేస్తాం. కలుపులు తీయడం తో పని భారం తగ్గుతుంది. మాకు ఒక పంట దెబ్బతిన్నా, మరో పం టతో పెట్టుబడులు దక్కుతాయి. దీంతో వానకాలంలో అంతర పంటలు సాగు చేస్తాం.
-దత్తురెడ్డి, రైతు హుగ్గెల్లి