టీఆర్ఎస్ పాలనలో సుందరంగా గ్రామాలు
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే కాంతారావు
రైతు వేదికలు, వైకుంఠధామాలు ప్రారంభం
కరకగూడెం, జూన్ 23: రైతు వేదికలు అన్నదాతల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. కరకగూడెం మండలం అనంతారం, సమత్ భట్టుపల్లి పంచాయతీల్లోని క్లస్టర్ల్లో నిర్మించిన రైతువేదికల భవనాలను ఎమ్మెల్యే రేగా బుధవారం ప్రారంభించారు. అలాగే మండలంలోని పద్మాపురం, సమత్ భట్టుపల్లి, భట్టుపల్లి, కన్నాయిగూడెం పంచాయతీల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ప్రారంభించి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకొని రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న వాగులపై చెక్డ్యాంలు ఏర్పాటు చేసి ఎకరం భూమి కూడా బీడు లేకుండా సాగునీళ్లను మళ్లిస్తామని తెలిపారు. పులుసుబొంత ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు పూర్తికావచ్చాయని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం త్వరలోనే ఉంటుందని స్పష్టంచేశారు. ఎంపీపీ రేగా కాళిక, జడ్పీటీసీ కొమరం కాంతారావు, పీఏసీఎస్ చైర్మన్ రవిశేఖర్వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వట్టం వెంకటేశ్వర్లు, మణుగూరు ఏడీఏ తాతారావు, పీఆర్ డీఈ సైదుల్రెడ్డి పాల్గొన్నారు.