ఇందూరు, ఏప్రిల్ 23 : ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్జోనల్ బ్రాంచ్ మిడ్టర్మ్ సీఎంఈ-2021 ప్రెస్కాన్ఫరెన్స్ను నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించారు. మాదకద్రవ్యాలతో కలిగే దుష్పరిణామాలు, మానసిక సమస్యలు, చికిత్సపై అవగాహన కల్పించేందుకు వర్చువల్ మీటింగ్ నిర్వహించామని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ విశాల్ తెలిపారు.
సౌత్జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాలకు చెందిన ప్రముఖులు పాల్గొనగా, ముఖ్యఅతిథిగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ హైదరాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.ఉమాశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ మాట్లాడుతూ ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలైన సిగరెట్, మద్యం, కొకైన్, గంజాయితోపాటు ఇంటర్నెట్ వంటి వాటికి బానిసగా మారి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మెంటల్ ఇల్నెస్ పెరిగిపోతోందని, డిప్రెషన్(ఒత్తిడి) పెరిగి, కుటుంబాలకు తీరని లోటును మిగిలిస్తున్నారని పేర్కొన్నారు.
వీటిని అరికట్టడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని, దాదాపు 14.6 శాతం యువత వీటి బారిన పడుతుండడంతో 27 జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖాన, మెడికల్ కళాశాలల్లో సైకియాట్రిస్ట్ సెంటర్లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మరో విశిష్టఅతిథి డాక్టర్ జగన్నాథ్ మాట్లాడుతూ.. నూతనంగా వచ్చిన వైద్యవిధానంలో మార్పులను తెలియజేయడం కోసం సెమినార్లు నిర్వహిస్తున్నామని, మానసిక సమస్యలపై అవగాహన కోసం నిజామాబాద్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించడంతోపాటు వాటిని అధిగమించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వ్యసనాలకు బానిసలవుతున్న యువత జీవితాలను బలి చేసుకుంటున్నారని, వారికి ఎలాంటి వైద్యం అందించాలి? వారిని డ్రగ్స్కు దూరంగా ఎలా ఉంచాలి? తదితర వాటిపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కాన్ఫరెన్స్లు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షుడు జీవన్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి.కిషన్, డాక్టర్ కె.రామకృష్ణన్, డాక్టర్ సురేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.