సికింద్రాబాద్, ఏప్రిల్ 14: మెట్టుగూడ శ్మశానవాటికలో వందేండ్లపైబడిన భారీ మర్రిచెట్టును కూల్చివేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్టుగూడ శ్మశాన వాటిక అభివృద్ధికి రూ.11 లక్షలు మంజూరయ్యాయి. ఏడాదిన్నరగా దహన సంస్కారాలు నిలిపివేసి.. మంజూరైన నిధుల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఫిబ్రవరిలోనే పనులు పూర్తిచేశారు. కేవలం శుభ్రంపరిచి దహన సంస్కారాలు కొనసాగించే అవకాశం ఉన్నా.. నిర్వాహకులు ఇంకా అనుమతించకపోవడంతోపాటు తాజాగా భారీ చెట్టును కొట్టేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.