మిన్నెసొటా: ఇదన్యాయం.. నేను డజను మాస్కులు ఆర్డర్ చేస్తే.. మీరు పన్నెండే పంపించారు. నా డబ్బులు నాకు వాపసు ఇవ్వండి అని ఎవరైనా అంటే మీకు ఏమనిపిస్తుంది. ఏదో జోక్ చేశాడులే అని ఈజీగా తీసుకుంటాం. కానీ అమెరికాలో ఓ వ్యక్తి మాత్రం చాలా సీరియస్గానే ఓ పెద్ద ఈమెయిల్ పంపించాడు. నేను డజను మాస్కులు ఆర్డర్ చేశాను. మీరు మాత్రం 12 మాత్రమే పంపించారు. దయచేసి మిగతావి కూడా పంపండి. ఇక నుంచి మీ బిజినెస్కు నేను సపోర్ట్ ఇవ్వను. బ్లాక్ వాళ్లు నడిపే స్టోర్లకు నేను సపోర్ట్ ఇద్దామని అనుకున్నాను. కానీ మీరు మాత్రం ప్రజలను దోచుకుంటూనే ఉన్నారు అన్నది ఆ మెయిల్ సారాంశం.
ఇది చూసిన ఆ స్టోర్ ఓనర్కు దిమ్మదిరిగిపోయింది. డజను అంటే పన్నెండే కదా. మీకు రీఫండ్ ఇవ్వడం కుదరదు అని మిన్నెసొటాలోని ఆ చిన్న స్టోర్కు ఓనర్గా ఉన్న జాడా మెక్క్రే అతనికి సమాధానమిచ్చింది. బిల్లులోనూ స్పష్టంగా 12 మాస్క్లకు డబ్బులు తీసుకున్నాము కదా అని కూడా ఆమె చెప్పింది. అది చూసిన కస్టమర్.. అవునా, నిజానికి నాకు 20 కావాలి. నేను బిల్లు సరిగా చూడలేదనుకుంటా. నేను డబ్ (20) జన్ అని అన్నాను అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ట్విటర్లో వైరల్ కాగా.. ఈ దెబ్బతో మెక్క్రే స్టోర్కు కూడా డిమాండ్ పెరిగిపోయింది. గతంలో అప్పుడోఇప్పుడో ఆర్డర్లు వస్తుండేవని, ఈ ఘటన తర్వాత రోజుకు 30 ఆర్డర్లు వస్తున్నాయని ఆమె చెప్పడం విశేషం.