ప్రిషా ప్రాజెక్టు ద్వారా 300 మందికి ఉపాధి కల్పించాం: దోసపాటి రాము
మన్సూరాబాద్, మార్చి 13: కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పేదలకు సామాజిక కార్యకర్త దోసపాటి రాము అపన్న హస్తం అందిస్తున్నా రు. రైస్ ఏటీఎం ద్వారా గత 340 రోజులుగా సుమారు 40 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇది ఒకవైపు కొనసాగుతుండగానే ఉపాధి కోల్పోయి ఏం చేయాలో తెలియక కొంద రు.. డబ్బులు లేక ఎలాంటి వ్యాపారాలు చేసుకోలేక మరి కొందరు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో అలాంటి వారికి ఒక దారి చూపేందుకు ఆయన ప్రాజెక్ట్ ప్రిషా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 60 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 300 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జనవరి చివరి వారంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనుకున్న సమయానికి కంటే ముందే 50 రోజుల్లోనే ప్రాజెక్ట్ ప్రిషా కార్యక్రమం ద్వారా 300 మంది ఉపాధి కల్పించారు. ఇందులో కొందరికి కుట్టు మిషన్లు, టిఫిన్ సెంటర్లు, ఇస్త్రీ షాపులు, కొబ్బరి బొండాల షాపులు, పిండి గిర్నీలు, టీ స్టాల్స్ పెట్టించారు. ఇందులో భాగంగా, శనివారం నాగోల్ డివిజన్ రాక్హిల్స్ కాలనీలోని రైస్ ఏటీఎం వద్ద చివరి విడత ప్రాజెక్ట్ ప్రిషా కార్యక్రమాన్ని నిర్వహించి 30 మందికి ఉపాధి కల్పించారు. కార్యక్రమంలో వాలంటీర్లు రఘు, రాఘవేంద్ర, నగేష్, అనిల్, రాకేష్, నాగరాజు, వినయ్, వెంకటేష్, నరేష్, కరణ్, సైదులు పాల్గొన్నారు.